ఏపీ పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిలతో మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయలో భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు చేపట్టాక సునీత ఆమెను కలవడం ఇదే తొలిసారి. దాదాపుగా ఇరువురు రెండు గంటల పాటు పలు అంశలపై కీలకంగా చర్చించినట్లు తెలుస్తోంది. సునీత త్వరలో కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం నడుస్తున్న క్రమంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
భేటీ అనంతరం వారిద్దరూ కలిసి ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు. వైఎస్ షర్మిలతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం సమావేశమయ్యారు. మరోవైపు కాసేపట్లో కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సునీత కూడా హాజరుకానున్నారు. పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి షర్మిల, కడప ఎంపీ స్థానం నుంచి సునీత పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.