
నిర్మల్ జిల్లా బైంసాలో వైఎస్ షర్మిల పాదయాత్ర
నిర్మల్ జిల్లా : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. ప్రాజెక్టులు నిర్మించి..ఉమ్మడి జిల్లాకు లక్షల ఎకరాలకు నీళ్లు అందించారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని, కాలువల మరమ్మతులను ఏనాడైనా పట్టించుకున్నారా..? అని ప్రశ్నించారు. బైంసా పట్టణానికి వైఎస్సార్ చాలా చేశారని, ఇప్పుడు కేసీఆర్ ఏం చేశారో చెప్పాలన్నారు. ‘ రాష్ట్రంలో ఏ పనైనా పూర్తి కావాలంటే స్థానిక ఎమ్మెల్యే 20శాతం కమీషన్లు అడుగుతాడట కదా ? దళితబంధులో కూడా ఎమ్మెల్యే వాటా అడుగడం దారుణం. బంగారు తెలంగాణ అని చెప్పి బార్ల తెలంగాణ..బీర్ల తెలంగాణగా మార్చారు’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ గతంలో ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని అమలు చేసి చూపిస్తామన్నారు. ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు మొద్దు నిద్రపోతున్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ కు అమ్ముడుపోయాయని ఆరోపించారు. బైంసా చెక్ పోస్టు నుండి వైఎస్ షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర సాగింది.
బాసర త్రిపుల్ ఐటీని కేసీఆర్ భ్రష్టు పట్టించారంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మాట్లాడేందుకు తనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదని మండిపడ్డారు. మైనార్టీలకు వైఎస్సార్ 4శాతం రిజర్వేషన్లు ఇచ్చారని, కేసీఆర్ మాత్రం 12శాతం ఇస్తానని మోసం చేశారంటూ మండిపడ్డారు. కేసీఆర్ కు ఒక ‘బీఆర్ఎస్’ పార్టీ పెట్టడం మాత్రమే చేతనైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గుడి, బడి కన్నా.. మద్యం షాపులే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని చెప్పారు. డిగ్రీలు, పీజీలు చదివిన వేలమంది నిరుద్యోగులు.. ఉద్యోగాలు లేక కూలీ పనులు చేసుకుంటున్నారని చెప్పారు. రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని రూ.4లక్షల కోట్ల అప్పుల కుప్పగా కేసీఆర్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపిస్తే.. ఆ తర్వాత ఆ ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నారని చెప్పారు. ప్రజల పక్షాన నిలబడేందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టామని చెప్పారు.