కేసీఆర్ అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేశాం

కేసీఆర్ అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేశాం

న్యూఢిల్లీ: కేసీఆర్ అవినీతి దాహానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ సజీవ సాక్ష్యమని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న షర్మిల సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కేసీఆర్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం రూ.38 వేల కోట్లు ఉండగా... కేసీఆర్ సీఎం అయ్యాక ఆ వ్యయం లక్షా 20 వేల కోట్లకు చేరుకుందని స్పష్టం చేశారు. చిన్న పని మొదలుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ పథకం వరకు ప్రతి కాంట్రాక్ట్ ను మేఘా సంస్థకే అప్పజెప్పుతున్నారని, కేసీఆర్ కు మేఘా సంస్థకు మధ్య అవినీతి ఒప్పందం ఉందని షర్మిల ఆరోపించారు.  మేఘా సంస్థకు టెండర్లు అప్పగించే క్రమంలో  నియమ, నిబంధనలను తుంగలో తొక్కారని ఫైర్ అయ్యారు. ఇక కేసీఆర్ ముందుచూపు లోపం, అసమర్థత వల్ల ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ దేనికి పనికి రాకుండా పోయిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం ఏడాదికి రూ.10 వేలకు పైగే అవుతోందని షర్మిల చెప్పారు. ఒకప్పుడు స్కూటర్ కూడా లేని కేసీఆర్ కు... ఇవాళ సొంతంగా విమానం కొనుక్కునేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కు ఏటీఎంలా మారిందన్న కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర షెకావత్.. రాష్ట్ర ప్రభుత్వంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ విషయంపై ఏమాత్రం నోరు మెదపడంలేదని, బహుశా మేఘా సంస్థ నుంచి వాళ్లకు ముడుపులు ముట్టాయని షర్మిల ఆరోపించారు. డీఐజీ లెవల్ అధికారితో కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించాలని సీబీఐని కోరినట్లు షర్మిల చెప్పారు. బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ మరో డ్రామాకు తెర తీశారని, బీఆర్ఎస్ తో దేశానికి గానీ ఒరిగిందేమీ లేదని చెప్పారు. కేసీఆర్ కు సీఎంగా కొనసాగే అర్హత లేదని, తక్షణమే ఆయన రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.