
- సెక్రటేరియట్ లో రేపు సాయంత్రం మీటింగ్
- కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండికి ఆహ్వానం
- బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఎంపీలకూ ఆహ్వానం
- పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ తోపాటు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్లమెంటు సభ్యులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు పంపారు.
ఏపీ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖ వద్దకు బనకచర్ల ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపిందని, ప్రాథమిక అధ్యయనంలో, ఈ ప్రాజెక్ట్ 1980 నాటి గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఉల్లంఘించినట్లు కనిపిస్తోందని మంత్రి లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజల నీటి హక్కులను హరించేలా ఉందని పేర్కొన్నారు.
ALSO READ | ప్రజల కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నం: భట్టి విక్రమార్క
దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ఈ ఏడాది జనవరి 22న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిపారు. దీనిపై స్పందించిన కేంద్ర జలశక్తి శాఖ తమకు ఏపీ నుంచి ఎలాంటి డీపీఆర్ అందలేదని పేర్కొందన్నారు. ఇదే అంశంపై తాను సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను కలిశామని తెలిపారు.
ఆ తర్వాత కూడా పలుమార్లు లేఖలు రాసినట్టు తెలిపారు. ఏపీ జలశక్తి శాఖకు ప్రతిపాదనలు పంపినందున దీనిని అడ్డుకొనేందుకు ఎలా ముందుకెళ్లాలనే విషయం చర్చించేందుకు రావాలని అన్ని పార్టీలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ని కూడా ఆహ్వానించామని వివరించారు.