ఓవైపు గాంధీ.. మరోవైపు గాడ్సే.. కాంగ్రెస్, బీజేపీ ఫైట్​పై రాహుల్

 ఓవైపు గాంధీ.. మరోవైపు గాడ్సే.. కాంగ్రెస్, బీజేపీ ఫైట్​పై రాహుల్
  •     దేశంలో చట్టాలు ఆర్ఎస్ఎస్ చేస్తోందని ఆరోపణ
  •     మధ్యప్రదేశ్ అవినీతికి కేంద్రంగా మారిందని విమర్శ

భోపాల్ :  కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీపై కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ సంచలన కామెంట్లు చేశారు. ఓవైపు మహాత్మాగాంధీ ఉంటే, మరోవైపు గాంధీని చంపిన గాడ్సే ఉన్నారని ఆయన అన్నారు. ‘‘మన దేశంలో రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రేమను పంచుతుంటే.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. మేం మహాత్మాగాంధీ ఐడియాలజీని అనుసరిస్తుంటే, వాళ్లు నాథురాం గాడ్సే ఐడియాలజీని అనుసరిస్తున్నారు. ఇది ప్రేమ, ద్వేషం మధ్య జరుగుతున్న పోటీ. ఓవైపు గాంధీ ఉంటే, మరోవైపు గాడ్సే ఉన్నారు” అని కామెంట్ చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్ లో రాహుల్ శనివారం పర్యటించారు. షాజాపూర్ జిల్లా కాలాపిపల్ నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆర్ఎస్ఎస్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే దేశంలోని చట్టాలను రూపొందిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ‘‘మన దేశం కేవలం 90 మంది కేంద్ర ప్రభుత్వ సెక్రటరీలతో నడుస్తోంది. చట్టాలు, పాలసీల రూపకల్పనలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల పాత్రేమీ ఉండడం లేదు. ఆర్ఎస్ఎస్, బ్యూరోక్రాట్లు కలిసి చట్టాలు రూపొందిస్తున్నారు” అని అన్నారు.

కుల గణనపై హామీ.. దేశంలో ఓబీసీల లెక్క తేలుస్తం..

బీజేపీ పాలనలో మధ్యప్రదేశ్ అవినీతికి కేంద్రంగా మారిందని రాహుల్ విమర్శించారు. ‘‘రాష్ట్రంలో వ్యాపం లాంటి ఎన్నో స్కామ్స్ జరిగాయి. ఎంబీబీఎస్ డిగ్రీలు అమ్ముకున్నారు. ఎగ్జామ్ పేపర్లు లీక్ చేశారు” అని చెప్పారు. 18 ఏండ్ల బీజేపీ పాలనలో 18 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. అంటే రాష్ట్రంలో రోజుకు ముగ్గురు రైతులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నేను భారత్ జోడో యాత్రలో భాగంగా మధ్యప్రదేశ్ లో 370 కిలోమీటర్లు నడిచాను. అప్పుడు నన్ను రైతులు, మహిళలు, యూత్ కలిశారు. దేశంలో ఎక్కడా జరగనంతా అవినీతి రాష్ట్రంలో జరిగిందని వాళ్లు చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా బీజేపీని ద్వేషిస్తున్నారు. ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు” అని అన్నారు. ‘‘మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ కోటా కల్పించకపోవడం అన్యాయం. మేం అధికారంలోకి వస్తే కులగణ చేపడతాం. దేశంలో ఎంతమంది ఓబీసీలు ఉన్నారో లెక్కిస్తాం” అని రాహుల్ హామీ ఇచ్చారు.