
అలాంటి అల్టిమేట్ క్రికెట్ ఫైట్కు మళ్లీ తెరలేచింది..! ఆసియా కప్లో భాగంగా నేడు జరిగే పోరులో ఇండియా, పాకిస్తాన్ అమీతుమీకి రెడీ అయ్యాయి..! పది నెలల గ్యాప్ తర్వాత ఫ్యాన్స్కు కిక్ ఇవ్వనున్నాయి..! గతేడాది ఇదే దుబాయ్ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్కప్ పోరులో తమను ఓడించిన పాకిస్తాన్పై రివెంజ్తీర్చుకోవడమే టార్గెట్గా టీమిండియా బరిలోకి దిగుతోంది..! ఆరిజల్ట్ను రిపీట్ చేయాలని పాక్ కోరుకుంటోంది..! టోర్నీలో ఇరుజట్లకు తొలి మ్యాచ్కావడం, ఫలితం రెండింటికీ కీలకం కాబట్టి హోరాహోరీ సమరం ఆశించొచ్చు..!
టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీకి వందో ఇంటర్నేషనల్ టీ20 కావడంతో ఈ పోరు మరింత స్పెషల్గా మారింది..! కొన్నాళ్లుగా ఫామ్లో లేని కోహ్లీ తిరిగి పుంజుకోవాలని అందరూ ఎదురు చూస్తున్నారు..! బ్యాట్తో మెప్పించి.. జట్టును గెలిపించి తన వందో మ్యాచ్ను మరింత స్పెషల్గా మార్చుకోవాలని ఆశిస్తున్నారు..! మరి విరాట్ హిట్ అవుతాడా? ఈ ఫైట్లో గెలిచి రోహిత్సేన రివెంజ్ తీర్చుకుంటుందా?
ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే ఫ్యాన్స్కు పండగే..! తమ అభిమాన క్రికెటర్ల ఆట చూసేందుకు వాళ్లంతా స్టేడియాలకు పోటెత్తుతారు..! మ్యాచ్ జరిగేంతసేపు రెప్పవాల్చకుండా టీవీలకు అతుక్కుపోతారు..! బంతి బంతికీ వాళ్ల హార్ట్బీట్ పెరిగిపోతుంటుంది..! చూసేవాళ్ల పరిస్థితే ఇలా ఉంటే.. కోట్లాది మంది ఆశలు మోస్తూ మైదానంలో గిరిగీసి కొట్లాడే ఆటగాళ్ల సంగతి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు..! చిరకాల ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు.. దాయాదిపై దమ్ముచూపి తమ దేశ జెండా ఎగరేసేందుకు ప్రాణం పెట్టి పోరాడుతారు..!
దుబాయ్: పేరుకు ఆసియా కప్ అయినా ఈ మెగా టోర్నీలో అందరి దృష్టి ఇండియా–పాకిస్తాన్ పోరుపైనే ఉంది. ఈ పోరు కోసం అభిమానులంతా వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారు. అధికారికంగా టోర్నీ నిన్ననే షురూ అయినా.. ఆదివారం రాత్రి గ్రూప్–ఎలో జరిగే ఇండో–పాక్ పోరుతోనే అసలు ఆట మొదలవనుంది. ఈ మెగా టోర్నీలో పాక్పై ఇండియాదే పైచేయి. కానీ షార్ట్ ఫార్మాట్లో పాక్ను తక్కువగా అంచనా వేస్తే ఫలితం ఎలా ఉంటుందో గతేడాది టీ20 వరల్డ్ కప్ తొలి పోరే ఉదాహరణ. నాడు టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన ఇండియాను పాక్10 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఐసీసీ ఈవెంట్లలో మన జట్టుపై తొలి విక్టరీ సొంతం చేసుకుంది. ఆ దెబ్బకు వరల్డ్కప్లో టీమిండియా గ్రూప్ దశలోనే నిష్ర్కమించింది. ఆ మ్యాచ్ తర్వాత పది నెలల కాలంలో 28 టీ20లు ఆడిన టీమిండియా ఏకంగా 22 మ్యాచ్ల్లో గెలిచి జోరు మీదుంది. ఇదే టైమ్లో పాకిస్తాన్ పది టీ20 ఆడి ఎనిమిది మ్యాచ్ల్లో గెలిచింది. రెండింటిలో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. అయితే ఈ పదింటిలో పాక్ ఈ ఏడాది ఒకే మ్యాచ్లో ఆడి (ఆసీస్పై) ఓడిపోవడం గమనార్హం. గత ఫలితాలు, ఫామ్ ఎలా ఉన్నా దాయాదుల పోరు అనగానే ఇరు జట్ల ఆటగాళ్లు గెలుపు కాంక్షతో పట్టుదలగా ఉంటారు. కాబట్టి హోరాహోరీ పోరు జరగొచ్చు.
కోహ్లీ కొడతాడా?
ఓపెనర్ల నుంచి స్పిన్నర్ల వరకు ఇండియా టీమ్లో అందరూ స్టార్లే. వీరిలో చాలా మంది మంచి ఫామ్లో ఉన్నారు. కానీ ఎమోషన్స్, ప్రెజర్ను హ్యాండిల్ చేయాల్సిన ఈ పోరులో జట్టు సమష్టిగా ఆడటం ముఖ్యం. ఫుల్ టైమ్ కెప్టెన్గా హిట్మ్యాన్ రోహిత్కు ఇదే తొలి మెగా ఈవెంట్. కాబట్టి బ్యాటర్గా, కెప్టెన్గా తను జట్టును ముందుండి నడిపించాల్సి ఉంటుంది. ఫుల్ ఫామ్లో ఉన్న రోహిత్, గాయం నుంచి కోలుకున్న ఓపెనర్ కేఎల్ రాహుల్తో కలిసి శుభారంభం అందించాలి. వీళ్లలో ఎవరు ఫెయిలైనా వన్డౌన్లో విరాట్ కోహ్లీ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. కొన్నాళ్లుగా అంచనాలను అందుకోలేకపోతున్న విరాట్.. వెస్టిండీస్, జింబాబ్వే టూర్లకు దూరంగా ఉండి ఆసియాకప్ పైనే పూర్తి ఫోకస్ పెట్టాడు. పైగా ఇది తనకు వందో టీ20. ఈ ఏడాది 12 మ్యాచ్ల్లో 189 స్ట్రయిక్ రేట్తో 482 రన్స్ చేసిన సూర్యకుమార్తో పాక్ బౌలర్లకు సవాల్ తప్పదు. బ్యాట్, బాల్తో చెలరేగే హార్దిక్ పాండ్యా జట్టుకు అదనపు బలం. కీపర్గా సీనియర్ దినేశ్ కార్తీక్తో పోటీ ఉన్నప్పటికీ రిషబ్ పంత్ వైపే మొగ్గు చూపే చాన్సుంది. బౌలింగ్ను నడిపించే సీనియర్ పేసర్ భువనేశ్వర్ జోరు మీదున్నాడు. పేసర్ బుమ్రా తో పాటు షార్ట్ ఫార్మాట్ స్పెషలిస్ట్ హర్షల్ లేకపోవడం ఇండియాకు లోటే. వారి స్థానాలను అనుభవం లేని అర్ష్దీప్, అవేశ్ ఖాన్ ఏ మేరకు భర్తీ చేస్తారన్నది ఆసక్తికరం.
షాహీన్ లేకున్నా షాన్దార్గానే
గతేడాది వరల్డ్ కప్లో ఇండియా బ్యాటింగ్కు, పాకిస్తాన్కు బౌలింగ్కు మధ్యనే పోటీ అనుకుంటే అంచనాలన్నీ తారుమారయ్యాయి. బౌలింగ్లో మెప్పించిన పాక్ బ్యాటింగ్లోనూ రెచ్చిపోయింది. ఏడాది కాలంగా సూపర్ ఫామ్లో ఉన్న రిజ్వాన్, బాబర్ నుంచి ఈసారి కూడా ముప్పు తప్పకపోవచ్చు. ఫఖర్ జమాన్ కూడా టచ్లోకి రావడంతో పాక్ బ్యాటింగ్ బలం పెరిగింది. ఆసిఫ్ అలీ రూపంలో మిడిలార్డర్లో భారీ షాట్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చే బ్యాటర్ పాక్ సొంతం. పేస్ లీడర్ షాహీన్ షా ఆఫ్రిది మోకాలి గాయంతో టోర్నీకి దూరం కావడం ఇండియాకు ప్లస్ పాయింట్. షాహీన్తో పాటు ఈ మధ్య షార్ట్ ఫార్మాట్లో రాణిస్తున్న మరో యంగ్ పేసర్ మొహమ్మద్ వసీం కూడా గాయపడి వైదొలిగాడు. వీళ్లు లేకపోయినా పాక్ బౌలింగ్ బలంగానే కనిపిస్తోంది. గత 22 టీ20 ఇన్నింగ్స్ల్లో 26 వికెట్లు పడగొట్టిన హారిస్ రవూఫ్, వసీం ప్లేస్లో జట్టులోకి వచ్చిన హసన్ అలీ (25 వికెట్లు), స్పిన్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ (20 వికెట్ల)తో ఇండియా బ్యాటర్లకు సవాల్ తప్పకపోవచ్చు.
పిచ్/వాతావరణం
దుబాయ్ పిచ్లు స్పిన్నర్లకు అనుకూలం. ప్రారంభంలో కొత్త బాల్తో పేస్ బౌలర్ల ప్రభావం ఉంటుంది. టాస్ నెగ్గిన జట్టు ఛేజింగ్కు మొగ్గు చూపొచ్చు.
తుది జట్లు (అంచనా)
ఇండియా: రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్య కుమార్, హార్దిక్ పాండ్యా, పంత్ / దినేశ్, జడేజా, భువనేశ్వర్, అవేశ్ ఖాన్/ అశ్విన్, చహల్, అర్ష్దీప్.
పాకిస్తాన్: బాబర్ (కెప్టెన్), రిజ్వాన్, ఫఖర్, ఆసిఫ్ అలీ, ఇఫ్తికర్, కుష్దిల్ షా, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ / ఉస్మాన్ ఖాదిర్, షానవాజ్ దహాని / మహ్మద్ హస్నైన్, హారిస్ రవూఫ్, నసీమ్ షా.
పాక్తో మ్యాచ్కు ముందు టీమిండియాకు గుడ్న్యూస్. చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొవిడ్ నుంచి కోలుకున్నాడు. తాజాగా రెండుసార్లు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్ట్లో నెగెటివ్ వచ్చింది. ఆదివారం దుబాయ్ బయలుదేరనున్న ద్రవిడ్ మ్యాచ్కు ముందే టీమ్తో కలవనున్నాడు.