
కారేపల్లి, వెలుగు: టాటా మ్యాజిక్ వాహనం స్టీరింగ్ విరగడంతో వాహనం అదుపుతప్పి అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు తీవ్రంగా గాయపడిన ఘటన కారేపల్లి మండలం పోలంపల్లి సమీపంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండాల మండలం కాచనపల్లికి చెందిన ఓ కుటుంబం కారేపల్లి మండలం జమాల్లపల్లి గ్రామంలో వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టాటా మ్యాజిక్ వాహనంలో బయలుదేరారు.
పోలంపల్లి సమీపంలో మూలమలుపు తిరుగుతుండగా స్టీరింగ్ విరిగిపోయి వాహనం అదుపుతప్పింది. రోడ్డు వెంట లోయలోని పొదల్లోకి దూసుకెళ్లింది. వాహనం లో ప్రయాణిస్తున్న కాచన పల్లికి చెందిన కృష్ణ, వెంకటనర్సు, రమేశ్, కనకమ్మ, సుభద్ర, సుజాతకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.