ఆరు గ్యారంటీలపై అసెంబ్లీలో వైట్ పేపర్ పెడ్తం : అక్బరుద్దీన్ ఒవైసీ

ఆరు గ్యారంటీలపై అసెంబ్లీలో వైట్ పేపర్ పెడ్తం : అక్బరుద్దీన్ ఒవైసీ
  •      అందుకు అనుమతివ్వండి 

హైదరాబాద్, వెలుగు: వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ​ఒవైసీ డిమాండ్ చేశారు. ఆర్థిక వ్యవస్థ, ఇరిగేషన్​పై వైట్​ పేపర్లు పెట్టిన ప్రభుత్వం.. ప్రతిపక్షాలకు కూడా వైట్ ​పేపర్ ​పెట్టే అవకాశం ఇవ్వాలన్నారు. ఆరు గ్యారంటీల అమలుపై తాము వైట్ ​పేపర్ ​పెడతామని, అందుకు సభ అనుమతివ్వాలని కోరారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్​పై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడారు. ‘‘గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను దిగజార్చిందంటూ కాంగ్రెస్ ​సర్కార్ అంటున్నది.

 ఆ విషయం తెలిసినప్పుడు బడ్జెట్ ​భారీగా అయ్యే ఆరు గ్యారంటీలను ఎలా ప్రకటించింది? బీపీఎల్​ కుటుంబాలనే తీసుకున్నా ఆరు గ్యారంటీల అమలుకు రూ.2.15 లక్షల కోట్లు కావాలి. ఇవే కాకుండా మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాల అమలుకు మరో రూ.3.70 లక్షల కోట్లు అవసరమవుతాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే బాగాలేనప్పుడు ఇన్ని హామీలను రాష్ట్ర సర్కార్​ ఎలా అమలు చేస్తుంది? అందుకే వీటిపై చర్చించేలా ప్రతిపక్షాలు వైట్​ పేపర్ ​పెట్టేందుకు అనుమతివ్వాలి’’ అని డిమాండ్​ చేశారు. 

మైనారిటీ గురుకులాలకేవీ పైసలు?

బడ్జెట్​లో బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాల బిల్డింగులకు నిధులు కేటాయించారని.. కానీ మైనారిటీ గురుకులాలను ఎందుకు విస్మరించారని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో స్టూడెంట్లకు ప్రైవేట్ కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. దీనిపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు.. టైపింగ్ పొరపాటు వల్ల మైనారిటీ గురుకులాల అలకేషన్లు బడ్జెట్​లో మిస్సయ్యాయని చెప్పారు. స్టూడెంట్లకు సర్టిఫికెట్లు ఇచ్చేలా కాలేజీలకు లేఖ రాస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేయించి, వక్ఫ్ భూములను కాపాడాలని ప్రభుత్వానికి అక్బరుద్దీన్​ విజ్ఞప్తి చేశారు.