వనపర్తి, వెలుగు: సీఎంఆర్ వడ్లు కేటాయించేందుకు ఓ రైస్ మిల్లర్ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా వనపర్తి సివిల్ సప్లై డీఎం కుంభ జగన్మోహన్ తో పాటు ఆయన డ్రైవర్ను గురువారం రాత్రి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సీఎంఆర్ వడ్లు కేటాయించేందుకు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సాంబశివ ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లర్ ను సివిల్ సప్లై డీఎం రూ.1.75 లక్షలు డిమాండ్ చేయగా, రూ. 50 వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు.
ఆ తరువాత ఏసీబీని ఆశ్రయించగా, వారి సూచనల మేరకు డీఎంకు డబ్బులు ఇవ్వగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు డబ్బులు డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. డీఎం, డ్రైవర్ను శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఇదిలాఉంటే సివిల్ సప్లై డీఎం జగన్మోహన్ ఏసీబీకి పట్టుబడడంతో పట్టణంలో సంబురాలు చేసుకున్నారు. డీఎం వేధింపులతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని మిల్లర్లు తెలిపారు. అనంతరం పటాకులు కాల్చి ఆనందాన్ని పంచుకున్నారు.
