
- కామన్ సెంట్రల్ సెక్రటేరియెట్, ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణం
న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ రాజధాని అమరావతిలో రెండు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం సెక్రటరీ పార్థ్ పాల్ రెండు వేర్వేరు ఉత్తర్వులు రిలీజ్ చేశారు. ఏపీ న్యూ క్యాపిటల్ సిటీ అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియెట్, జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామడేషన్ (జీపీఆర్ఏ) నిర్మాణం సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్టెమ్మెంట్ (సీపీడబ్ల్యూడీ) నిర్వహిస్తుందని అందులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నారు.
గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2025 మే 22న, 2025 జూన్ 11న సమర్పించిన ప్రతిపాదనకు సూత్రప్రాయ ఆమోదం మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఈ అంశంపై కాన్సెప్ట్ నోట్, వివరణలను పంపాలని కోరినట్లు తెలిపారు. ఆర్థిక శాఖ వ్యయ విభాగ ప్రతిపాదనను పరిశీలించిన తరువాత సీపీడబ్ల్యూడీ చేపట్టనున్న కామన్ సెంట్రల్ సెక్రటేరియెట్, జీపీఆర్ఏ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు ప్రస్తావించారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని పీఐబీ సమావేశంలో అంచనా వేస్తారని పేర్కొన్నారు.
అయితే ఈ రెండు ప్రాజెక్టులు రూ.2,787 కోట్లతో నిర్మించనున్నారు. రూ.1,329 కోట్లతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు క్వార్టర్స్ నిర్మాణం, అదేవిధంగా రూ.1,458 కోట్లతో కామన్ సెంట్రల్ సెక్రటేరియెట్ నిర్మాణం చేపట్టనుంది. 2018 నుంచి పెండింగ్లో ఉన్న ఈ రెండు ప్రాజెక్ట్లకి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తన ‘ఎక్స్’ అకౌంట్లో పేర్కొన్నారు.