హెల్త్‌‌‌‌ రంగంలో భారీ వృద్ధిని సాధించాం : అమిత్‌‌ షా

హెల్త్‌‌‌‌ రంగంలో భారీ వృద్ధిని సాధించాం : అమిత్‌‌ షా
  • ఇదంతా ప్రధాని మోదీ వల్లే సాధ్యమైంది: అమిత్‌‌ షా

నాగ్‌‌పూర్‌‌‌‌: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో హెల్త్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ భారీ వృద్ధిని సాధించిందని, గత కాంగ్రెస్‌‌ ప్రభుత్వాలు ఈ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌‌ షా అన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌‌పూర్‌‌‌‌లో ఉన్న నేషనల్‌‌ క్యాన్సర్‌‌‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ (ఎన్‌‌సీఐ)లో క్యాన్సర్‌‌‌‌ పేషెంట్లు, వారి అటెండెంట్ల వసతి కోసం ‘స్వస్తి నివాస్‌‌’కు సోమవారం అమిత్‌‌ షా శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ఆరోగ్య రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ప్రైవేటు రంగం కూడా సహాయ సహకారాలు అందించడంపై ప్రశంసించారు.

 ‘‘మోదీ హయాంలో హెల్త్‌‌ సెక్టార్‌‌‌‌ రంగానికి బడ్జెట్‌‌లో రూ.1.35 లక్షల కోట్లు కేటాయించామని, అదే కాంగ్రెస్‌‌ హయాంలో రూ.37 వేల కోట్లు మాత్రమే ఈ రంగానికి ఖర్చు పెట్టారు. ప్రపంచంలోనే అత్యధిక శాతం నోటి క్యాన్సర్‌‌‌‌ రోగులు ఇండియాలోనే ఉన్నారు. అలాగే, ప్రతి 8 నిమిషాలకు ఒకరు గర్భాశయ (సర్వీకల్‌‌) క్యాన్సర్‌‌‌‌తో మరణిస్తున్నారు. కొన్నేండ్ల కింద క్యాన్సర్‌‌‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ అందరికీ అందుబాటులో ఉండేది కాదు. గత 15 ఏండ్లలో పెద్ద పెద్ద ఇన్‌‌స్టిట్యూట్స్‌‌లో క్యాన్సర్‌‌‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ అందుబాటులోకి వచ్చింది. మోదీ ప్రభుత్వం దేశ ఆరోగ్య ముఖచిత్రాన్ని మార్చింది. 60 కోట్ల మంది పేదలకు రూ.5 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందుకుంటున్నారు”అని ఆయన వెల్లడించారు.