
- కేంద్ర హోం మంత్రి అమిత్ షా
బెంగళూరు: హెల్త్ సెక్టార్ను మోదీ ప్రభుత్వం గాడిన పెట్టిందని, ప్రజలు ఎదుర్కొంటున్న హెల్త్ ఇష్యూస్ను దూరదృష్టితో పరిష్కరించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. శుక్రవారం బెంగళూరులోని ఆదిచుంచుగిరి యూనివర్సిటీ క్యాంపస్ను ప్రారంభించి, మాట్లాడారు. పేదరికానికి అతిపెద్ద కారణం అనారోగ్యం, దానికి అయ్యే ట్రీట్మెంట్ ఖర్చులే అని ప్రధాని మోదీ కొన్నేండ్ల క్రితం గుజరాత్ లో చెప్పారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఫ్రీ ట్రీట్మెంట్ అందించడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
నేడు దేశంలోని 60 కోట్ల మంది పేదలకు రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తున్నామని తెలిపారు. 12 కోట్ల ఇండ్లలో టాయిలెట్లు కట్టించి అంటువ్యాధులు ప్రబలకుండా చూశామని చెప్పారు. ఫిట్ ఇండియా మూవ్ మెంట్, యోగా డే, మిషన్ ఇంద్రధనుష్, పోషణ్ అభియాన్, ఆయుష్మాన్ భారత్, భారతీయ జన ఔషధి పరియోజన వంటి పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.