కొనసాగుతున్న మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర

కొనసాగుతున్న మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర
  • అంతిమ వీడ్కోలుకు హాజరుకానున్న సీఎం జగన్

నెల్లూరు జిల్లా: గుండెపోటుతో కన్నుమూసిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర కొనసాగుతోంది. మరికొద్దిసేపట్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. నెల్లూరు పట్టణంలోని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నివాసం నుంచి ఆయన అంతిమ యాత్ర బుధవారం ఉదయం 6.15 గంటలకు ఉదయగిరికి బయలుదేరింది. అంతిమయాత్ర కాన్వాయ్ లో  రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర రవాణా, సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని, జిల్లా ఇంఛార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్,  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తదితర ప్రముఖులు అంతిమయాత్రతో పాటు బయలుదేరారు.
 

శోకసంద్రంలో స్వగ్రామం బ్రాహ్మణపల్లి
దివంగత మంత్రి మేకపాటి స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో  జనం అడుగడుగునా నీరాజనం పలికారు. అంబులెన్స్ ని తాకుతూ, తడుముతూ వెక్కి వెక్కి ఏడ్చారు మంత్రి మేకపాటి సొంత గ్రామ ప్రజలు. పూలవర్షం కురిపిస్తూ కన్నీటి వీడ్కోలు పలికారు బ్రాహ్మణపల్లి గ్రామస్తులు. మిన్నంటిన రోదనల నడుమ అంతిమ రథం యాత్ర నెమ్మదిగా ముందుకు సాగింది. కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరుకానున్నారు.