
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామికి ఆదివారం గర్భగుడిలో మూలవరులకు పంచామృతాలతో అభిషేకం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం బాలబోగం నివేదించారు. ఆవుపాలు,పెరుగు, నెయ్యి, తేనె, పంచదారలతో అభిషేకం జరిగింది. మూలవరులకు మంజీరాలను అద్దారు. విశేష స్నపన తిరుమంజనం చేశారు. అభిషేకం అనంతరం భక్తులకు జలాలను పంపిణీ చేశారు. విశేష అలంకరణ చేసి మూలవరులకు బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు.
ఆషాఢ ఆదివారం, వీకెండ్ కావడంతో రామదర్శనం కోసం భక్తులు భారులు తీరారు. భక్తులతో రామాలయం కళకళలాడింది. క్యూలైన్లు నిండిపోయాయి. వర్షం, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బేడా మండపంలో నిర్వహించాల్సిన నిత్య కల్యాణంను చిత్రకూట మండపంలో చేపట్టారు. 75 జంటలు కంకణాలు ధరించి క్రతువును చేపట్టాయి. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. పాపికొండల విహారయాత్రకు వెళ్లిన టూరిస్టులు రాడంతో రాత్రి ఆలయంలో దర్శనాల కోసం భక్తులు కిటకిటలాడారు.