నిరూపిస్తే రాజీనామా చేస్తా

 నిరూపిస్తే రాజీనామా చేస్తా

నిజామాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరిగినట్లుగా నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సవాల్ విసిరారు. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం దామరంచ గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా స్పీకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని.. రాష్ట్రంలో బాన్సువాడ నియోజకవర్గానికి మాత్రమే పదివేల ఇండ్లు మంజూరు అయ్యాయన్నారు. మరో అయిదువేల ఇండ్లను తెచ్చి మిగిలిన పేదలందరికి మంజూరు చేస్తానన్నారు. నియోజకవర్గ పరిధిలో సొంత ఇల్లు లేని పేదలందరికి స్వంత ఇంటి కలను నిజం చేయడమే నా ఆశయం అన్నారు. దేశంలో రెండు వేల రూపాయలు ఆసరా పెన్షన్లుగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రూ.12,000 కోట్ల ఆసరా పెన్షన్లు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని.. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా ఉందన్నారు. రాజకీయాలు హుందాగా ఉండాలన్న ఆయన.. మైకు దొరకగానే విమర్శలు చేసే ముందు మీ జాతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఇలాంటి అభివృద్ధి చేసి, సంక్షేమ పథకాలను అమలుచేసి ఇక్కడ మాట్లాడాలన్నారు.