న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ చీఫ్ గెస్ట్గా హాజరుకానున్నారు. రెండ్రోజుల భారత పర్యటనలో భాగంగా ఆయన గురువారం మధ్యాహ్నం జైపూర్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ కానున్నారు. ఆపై ఆరు గంటల పాటు మెక్రాన్ జైపూర్ లోనే ఉంటారని పీఎంవో తెలిపింది. జైపూర్లో మెక్రాన్ను ప్రధాని మోదీ సాయంత్రం 5.30 గంటలకు కలుస్తారని, ఇద్దరు కలిసి సిటీలోని పర్యాటక ప్రదేశాలైన జంతర్ మంతర్, హవా మహాల్, అల్బర్ట్ హాల్ మ్యూజియాన్ని సందర్శిస్తారని వెల్లడించింది.
సాయంత్రం 6 గంటలకు జంతర్ మంతర్లో మోదీ, మెక్రాన్ రోడ్ షోలో పాల్గొననున్నారని చెప్పింది. 7.15 గంటలకు ఇరువురు నేతలు భేటీ అయి, పలు కీలక అంశాలపై చర్చించనున్నారని తెలిపింది. డిజిటల్ డొమైన్, డిఫెన్స్, ట్రేడ్, క్లీన్ ఎనర్జీ, యూత్ ఎక్స్ఛేంజ్, ఇండియన్ స్టూడెంట్లకు వీసా నిబంధనల సడలింపు సహా పలు రంగాల్లో పరస్పరం ఇరు దేశాలు సహకారాన్ని పెంపొందించే విషయంపై చర్చించనున్నారని పేర్కొంది. ఆ తర్వాత మెక్రాన్ రాత్రి 8.50 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.
శుక్రవారం రిపబ్లిక్ డే పరేడ్స్లో ఫ్రాన్స్కు చెందిన 95 మంది సభ్యుల కవాతు బృందం, 33 మంది సభ్యుల బ్యాండ్ బృందం కూడా పాల్గొననుంది. ఆ దేశ ఎయిర్ ఫోర్స్కు చెందిన రెండు రాఫెల్ ఫైటర్ జెట్లు, ఎయిర్బస్ ఏ330 మల్టీ రోల్ ట్యాంకర్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ కూడా పరేడ్లో పాల్గొంటాయి. అదే రోజు రాత్రి 7.10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఏట్ హోం కార్యక్రమానికి మెక్రాన్ హాజరుకానున్నారు. తర్వాత రాత్రి 10.05 గంటలకు ఆయన ఢిల్లీ నుంచి ఫ్రాన్స్కు బయలుదేరి వెళ్లనున్నారు.