బీజేపీ పోరాటం వల్లే జీవో 118 : బండి సంజయ్

బీజేపీ పోరాటం వల్లే జీవో 118   : బండి సంజయ్

హైదరాబాద్: తాము చేసిన పోరాటం వల్లే రాష్ట్ర ప్రభుత్వం జీవో 118ని విడుదల చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఎల్బీనగర్, మేడ్చల్, రాజేంద్రనగర్, కార్వాన్, జూబ్లీహిల్స్, నాంపల్లి నియోజకవర్గాల పరిధిలో ఇండ్ల నిర్మాణాల క్రమబద్ధీకరణ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ  జీవో 118 జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానన్న సంజయ్..  కుంటి సాకులు చెప్పకుండా జీవో 118ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రాజీనామాకు భయపడే ప్రభుత్వం ఈ జీవో తెచ్చిందన్నారు.

అప్పటికే నిర్మించుకున్న ఇండ్లను నిషేధిత జాబితాలో చేర్చారని,  ఎనిమిదేళ్లుగా ఆ ఇండ్లను క్రమబద్దీకరించకుండా  రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్రలో అక్కడి ప్రజలు తనకు గోడును వెళ్లబోసుకున్నారని ఆయన తెలిపారు. జీవో 118ని వెంటనే అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని బండి సంజయ్ హెచ్చరించారు.