గాజుల పండుగ మొదలైంది

గాజుల పండుగ మొదలైంది

మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు, పట్టణాల్లో గాజుల పండుగ చేసుకుంటారు. ఇప్పుడు నిర్మల్ జిల్లాలోనూ ఈ పండుగ మొదలైంది. పుష్య మాసంలో గాజుల పండుగ మొదలవుతుంది. అప్పుడు, పెళ్లైన మరదలిని పుట్టింటికి పిలిచి, గాజులు తొడిగి, ఆశీర్వదిస్తుంది వదిన. అలాగే మరదలు కూడా వదినకి గాజులు తొడిగి, నాలుగు మంచి మాటలు చెప్తుంది. ఈ పండుగ కోసం వంద నుంచి వెయ్యి రూపాయల వరకు ఖర్చు పెట్టి గాజులు కొంటారు. కొందరు వదినలు మరదలిపై  వాళ్లకున్న  ప్రేమను తెలియజేయడానికి మరో అడుగు ముందుకేసి.. మరదళ్లకు గాజులతోపాటు చీరెలు లేదా గిఫ్ట్​లు ఇస్తుంటారు. వదిన, మరదళ్ల మధ్య ఏవో మాటల వల్ల వచ్చే పొరపొచ్చాలు, అపార్థాలు కూడా ఈ పండుగనాడు కలవడం వల్ల పోయే అవకాశం ఉంది. అందుకే కుటుంబాల్లో కలతలు తొలగించి, సంతోషాన్ని నింపే పండుగ అని కూడా అంటారు. 
నిజానికి ఇది మహారాష్ట్ర పండుగ అయినా, ఇప్పుడు తెలంగాణలోని నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో కూడా చేసుకుంటున్నారు. ఈ వేడుక ఒక్క రోజు, వారం రోజుల్లో అయిపోయేది కాదు. సుమారు రెండు నెలలు జరుగుతుంది. జనవరిలో మొదలై... ఇప్పటికే నెల పూర్తైంది. ఇంకా నెల రోజులు ఈ గాజుల పండుగ చేసుకుంటారు. ::: బాజనోళ్ళ బాజేందర్, భైంసా