బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం... అనుమానాస్పదంగా మరో విద్యార్థిని మృతి

బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం... అనుమానాస్పదంగా మరో విద్యార్థిని మృతి

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం చోటు చేసుకుంది. జూన్ 14వ తేదీన దీపిక అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడగా..తాజాగా మరో విద్యార్థిని చనిపోయింది. అర్థరాత్రి లిఖిత అనే విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందింది. హాస్టల్ భవనం నాలుగో అంతస్తుపై నుంచి లిఖిత కిందపడి మృతిచెందింది. అర్థరాత్రి 2 గంటల సమయంలో  ఈ ఘటన జరిగడం గమనార్హం. అయితే లిఖిత కిందపడిన విషయాన్ని గమనించిన  భద్రతా సిబ్బంది...ఆమెను  క్యాంపస్ హెల్త్ సెంటర్ కు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం బైంసా ఏరియా హాస్పిటల్ కి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కానీ అప్పటికే లిఖిత మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. 

ఆత్మహత్యా లేఖ ప్రమాదమా...

లిఖిత హాస్టల్ నాలుగో అంతస్తుపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. కానీ యాజమాన్యం, క్యాంపస్ సిబ్బంది మాత్రం ఆమె ప్రమాదవశాత్తూ భవనం పైనుంచి జారిపడి మృతిచెందిందని అంటున్నారు. లిఖిత పీయూసీ ఫస్టియర్ చదువుతోంది. ఆమె స్వస్థలం సిద్ధిపేట జిల్లా గజ్వేల్. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రమాదవశాత్తూ కిందపడిందా ... ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.