పరువు తీస్తున్నాడని మామని కొట్టి చంపిండు

 పరువు తీస్తున్నాడని మామని కొట్టి చంపిండు

కల్వకుర్తి, వెలుగు: ఊర్లోని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని పరువు తీస్తున్నాడనే కోపంలో సొంత మామను అల్లుడే కొట్టి చంపాడు. కల్వకుర్తి సీఐ సైదులు వివరాల ప్రకారం.. నాగర్​కర్నూల్​జిల్లా కల్వకుర్తి మండలం మార్చాలకు చెందిన పెరుమాండ్ల సత్యనారాయణ(48), శాంతమ్మ భార్యాభర్తలు. వీరి కూతురు రజితను తలకొండపల్లి మండలం చుక్కాపూర్ కు చెందిన కాలూరు బాలకృష్ణకు ఇచ్చి పెళ్లి చేశారు. ఏడాదిగా కూతురు, అల్లుడు మార్చాలలోనే ఉంటున్నారు. కాగా సత్యనారాయణ ఊర్లోని ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, తరచూ ఆమెకు డబ్బు, బంగారం ఇస్తున్నాడని అల్లుడు బాలకృష్ణకు తెలిసింది. ఈ నెల 19న సత్యనారాయణ సదరు మహిళతో పొలం వద్ద ఉన్నాడని తెలుసుకున్న బాలకృష్ణ అక్కడికి వెళ్లి మామను కొట్టాడు. కర్చీఫ్​ను మెడకు బిగించి చంపేశాడు. శాంతమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తులో అల్లుడే హత్య చేసినట్లు తేలింది. బాలకృష్ణను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. నిందితుడిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.