కాళేశ్వరం డిజైన్ పూర్తిగా కేసీఆర్​దే..ఆయన ఎవరి మాటా వినేవారు కాదు

కాళేశ్వరం డిజైన్ పూర్తిగా కేసీఆర్​దే..ఆయన ఎవరి మాటా వినేవారు కాదు
  • ఆయన ఎవరి మాటా వినేవారు కాదు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి 
  • ఎవరైనా తప్పు ఎత్తిచూపితే మళ్లీ పిలిచేవారు కాదు 
  • ఇందులో ఈటల పాత్ర నామమాత్రమన్న బీజేపీ ఎంపీ
  • గూగుల్​ మ్యాప్​లు చూసి డిజైన్​ చేశారని వెల్లడి

హైదరాబాద్, వెలుగు:  కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్​ పూర్తిగా కేసీఆర్​దేనని.. ఇందులో ఈటల, హరీశ్​రావు, కేటీఆర్ సహా ఎవరికీ సంబంధం లేదని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టుపై కేసీఆర్ నిర్వహించిన పదికిపైగా మీటింగులకు ఓ ఇంజినీర్​గా హాజరయ్యానని, ఆ అనుభవంతో ఈ విషయం చెప్తున్నానన్నారు. 


‘‘ప్రాణహిత ఒక అసాధ్యమైన ప్రాజెక్టు. అంతకంటే కాళేశ్వరం ఇంకా అసాధ్యమైనది. ఇది తెలంగాణను ముంచే ప్రాజెక్టు. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆరే. ఆయన చెప్పినదానికల్లా తలూపిన ఇంజినీర్లకు కూడా ఇందులో పాపముంది. అంతేతప్ప ఇందులో ఈటల రాజేందర్​కు 0.1 శాతం కూడా సంబంధం లేదు. ఒకవేళ కేసీఆర్​ను ప్రొటెక్ట్​చేయాలని ఈటల ప్రయత్నిస్తే మాత్రం ముమ్మాటికీ తప్పే’’ అని కొండా స్పష్టం చేశారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తేలినప్పటికీ, ఏడాదిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. ‘‘ప్రాణహిత–చేవెళ్ల ఒక అసాధ్యమైన ప్రాజెక్టు. తెలంగాణ ఉద్యమాన్ని చల్లార్చేందుకు రాయలసీమ పాలకులు మనకు ఇచ్చిన చాక్లెట్ అది. ఆ రోజే ఇది తెలంగాణను నాశనం చేసే ప్రాజెక్టు అని చెప్పిన. చేవెళ్ల వరకు నీళ్లు రావాలంటే ఎకరానికి రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల కరెంట్ ఖర్చవుతదని చెప్పిన. తెలంగాణ వచ్చాక కేసీఆర్ రద్దు చేస్తడనుకుంటే రద్దు చేయలే. అంబేద్కర్ పేరు తీసేసి కాళేశ్వరం పేరు పెట్టిండు. కాంగ్రెస్ నయ్యం. కనీసం తుమ్మిడిహెట్టి నుంచి నీళ్లు తేవాలనుకుంది. కానీ, కేసీఆర్ ​మాత్రం తుమ్మిడిహెట్టి నుంచి నీళ్లు మేడిగడ్డ దాకా వచ్చినంక, పైకి ఎత్తిపోసుడు, రివర్స్ పంపింగ్ పెట్టిండు. ఇది ప్రకృతికి విరుద్ధం. ఈ లెక్కన కేసీఆర్ డిజైన్​తో పోలిస్తే కాంగ్రెస్ డిజైన్ బెటర్’’ అని కొండా ఎద్దేవా చేశారు. 

గూగుల్ మ్యాప్ లు చూసి డిజైన్ చేశారు.. 

కేసీఆర్ చీఫ్ ఇంజినీర్, క్వాలిటీ సెల్ మెంబర్ కూడా  కాకపోయినా.. ఇంజినీర్లను పిలిపించి గూగుల్ మ్యాప్​ల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుకు డిజైన్ చేశారని కొండా తెలిపారు. బీఆర్ఎస్​ ఎంపీగా, ఓ ఇంజినీర్​గా కాళేశ్వరంపై కేసీఆర్​ ఇంటర్నల్​గా నిర్వహించిన సుమారు పది మీటింగులకు తాను హాజరయ్యానని తెలిపారు. ఇంజినీర్లు విద్యాసాగర్​ రావు, రంగారెడ్డి సహా ఓ పది మంది తమతో ఉండేవారన్నారు. ఆ మీటింగుల్లో ఒక్కసారి కూడా ఈటలగానీ, హరీశ్​రావుగానీ పాల్గొనలేదని చెప్పారు. ‘‘కాళేశ్వరం ముమ్మాటికీ కేసీఆర్ ​ప్లానింగే. తాను ఏది చెప్తే దానికి తలాడించే ఇంజినీర్లను చుట్టూ పెట్టుకున్నారు. ఎవరై నా తప్పు ఎత్తిచూపితే వాళ్లను పక్కనపెట్టేసేవారు. నేను ఓ రెండుసార్ల అట్లా కాదు, ఇట్లా అని చెబితే నన్ను కూడా పిలుసుడు మానేసిండు. మొదట్లో ఆయనకు అన్నీ తెలుసని అనుకున్నా. కానీ, ఆ తర్వాతే ఆయనకు తెలియదు. తెలిసినవాళ్ల మాట వినడు అని అర్థమై దూరం ఉన్నా. ఓవరాల్​గా ఏందంటే ఆయన ప్లాన్ నదిని ఉల్టా తిప్పుడు. తెలంగాణను ముంచుడు’’ అని విమర్శించారు. కాళేశ్వరం ఒక పనికిమాలిన, దరిద్రపు ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు వల్లే తెలంగాణకు ఆర్థికంగా కష్టాలు మొదలయ్యాయన్నారు. టెక్నికల్ అంశాలతో కూడిన డీటెయిల్స్ వీడియోను త్వరలోనే విడుదల చేస్తానని కొండా వెల్లడించారు.