
హైదరాబాద్: బతుకమ్మ పండగ వేళ కరీంనగర్ జిల్లాలోని బొమ్మకల్ రోడ్డులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సిమెంట్ పైపుల ఫ్యాక్టరీ వాటర్ ట్యాంకులో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు. వివరాల ప్రకారం.. బీహార్కు చెందిన బిట్టు కుమార్ కరీంనగర్ జిల్లాలోని బొమ్మకల్ రోడ్డులో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబంతో కలిసి ఉంటున్నాడు.
బిట్టుకుమార్కు సత్యం (4), అర్వన్ (2) ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం (సెప్టెంబర్ 21) బిట్టుకుమార్ ఇద్దరు కుమారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ సిమెంట్ పైపుల ఫ్యాక్టరీ వాటర్ ట్యాంకులో పడిపోయారు. వెంటనే ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యలు నిర్ధారించారు.
పండగ వేళ ఒకేసారి ఇద్దరు కొడుకులు మృతి చెందటంతో బిట్టు కుమార్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సత్యం, అర్వన్ ప్రమాదవశాత్తూ వాటర్ ట్యాంకులో పడ్డారా..? లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.