
- రోడ్డు విస్తరణకు ప్రభుత్వం సహకరిస్తుంది
జూబ్లీహిల్స్, వెలుగు: బోరబండ డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం నుంచి రూ. 12 కోట్లు మంజూరు చేయించే బాధ్యత తనదని మంత్రి గడ్డం వివేక్వెంకట స్వామి హామీ ఇచ్చారు. ఆదివారం బోరబండలో స్థానిక కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన బూత్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
బోరబండ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే రాబోయే రోజుల్లో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇక్కడ నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చే విధంగా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుందన్నారు. బోరబండలో ఉన్న ప్రతి బూత్ నుంచి నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజల కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. బోరబండలోని రోడ్డు విస్తరణకు ప్రభుత్వం సహకరిస్తుందని, ఇకపై బోరబండలో ట్రాఫిక్చిక్కులు ఉండవన్నారు.