అభ్యర్థులు కావలె..!మున్సిపాలిటీల్లో బీఆర్‌‌ఎస్ లో విచిత్ర పరిస్థితి

 అభ్యర్థులు కావలె..!మున్సిపాలిటీల్లో బీఆర్‌‌ఎస్ లో విచిత్ర పరిస్థితి

 

  • అసెంబ్లీ ఎన్నికల తర్వాత నేతల వలసలే కారణం
  • కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన తర్వాతే ఎంపిక 
  • చేయాలని నిర్ణయం అసంతృప్తులే దిక్కు 
  • పోటీకి వెనుకాడతున్న బీఆర్‌‌ఎస్  క్యాడర్​

యాదాద్రి, వెలుగు: పదేండ్లు పవర్‌‌లో ఉన్న బీఆర్‌‌ఎస్‌కు మున్సిపల్​ఎన్నికల్లో అభ్యర్థుల కొరత వెంటాడుతోంది. యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్​తరపున పోటీ చేయడానికి ఆశావహులు పోటెత్తుతుంటే..  బీఆర్‌‌ఎస్‌ తరపున పోటీ చేయడానికి కొన్ని వార్డుల్లో ఆ పార్టీ లీడర్లు వెనకంజ వేస్తున్నారు. కాంగ్రెస్​ అభ్యర్థుల ఎంపిక తర్వాతే తమ అభ్యర్థులను ఎంపిక చేయాలని ఉద్దేశంతో బీఆర్‌‌ఎస్​ పార్టీ కూడా వేచి చూసే ధోరణిని అవలంభిస్తోంది. 

పంచాయతీ ఎన్నికల రిజల్ట్ తో... 

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. గెలుస్తామనుకున్న స్థాయిలో పంచాయతీలు గెలుపొందలేదు. దీంతో ఆ పార్టీ లీడర్లు, కేడర్​ నిరాశకు లోనయ్యారు. ఈ తరుణంలో మున్సిపాలిటీ ఎన్నికలు వస్తుండడంతో ఇప్పుడైనా ఎక్కువ వార్డులతో పాటు చైర్మన్​ సీట్లు కైవసం చేసుకోవాలని చూస్తోంది. అయితే పవర్​లో ఉన్నప్పుడే 2020లో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆ పార్టీ ఆలేరు, భూదాన్​ పోచంపల్లి మాత్రమే గెలిచింది. మోత్కూరు మన్సిపాలిటీని డ్రా పద్ధతిలో గెలుచుకుంది. మెజారిటీ కౌన్సిలర్లు గెలవకపోవడంతో చౌటుప్పల్​, యాదగిరిగుట్ట, భువనగిరి మున్సిపాలిటీల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్​అఫిషియో ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.

భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో వారు ఓట్లు వేసినా ఫలితం దక్కే అవకాశం లేకపోవడంతో భువనగిరిలో  ఓ బీజేపీ కౌన్సిలర్, చౌటుప్పల్​లో సీపీఎం కౌన్సిలర్ల ​సహకారం తీసుకొని చైర్మన్​సీట్లను బీఆర్‌‌ఎస్‌ చేజిక్కించుకుంది.  ఆ తర్వాత జరిగిన పరిణామాలతో చౌటుప్పల్, యాదగిరిగుట్ట​ చైర్మన్లు​కాంగ్రెస్​లో చేరారు. మోత్కూరులో అవిశ్వాసం కారణంగా బీఆర్​ఎస్​ చైర్మన్​ పదవి కోల్పోగా, కాంగ్రెస్​ కౌన్సిలర్​ చైర్మన్​గా ఎన్నికయ్యారు. 

పోటీ చేయడానికి వెనుకడుగు.!

2023 అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్​ఎస్​ నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్​లో చేరికలు జరిగాయి. ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా మున్సిపాలిటీల్లో బీఆర్​ఎస్​ క్యాడర్​ కొంత బలహీనంగా ఉంది. కాంగ్రెస్​ నుంచి పోటీ చేయడానికి విపరీతమైన పోటీ  నెలకొంటే.. బీఆర్​ఎస్​ తరఫున పోటీ చేయడానికి అంతగా ఉత్సాహం చూపడం లేదు.  పవర్‌‌లో ఉన్న సమయంలోనే మున్సిపాలిటీల్లో మెజారిటీ రాకపోవడంతో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఎక్స్​ అఫిషియో ఓట్ల సహకారంతో చైర్మన్లు దక్కించుకున్న సంగతిని గుర్తు చేసుకుంటున్నారు.

దీంతో పోటీ చేయడానికి వెనుకాడుతున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపికలో  ‘వెయిట్​ అండ్​ సీ’ అన్న ధోరణిని అవలంభించాలని చూస్తున్నారు.  కాంగ్రెస్​ తన అభ్యర్థులను ఎంపిక చేసిన తర్వాతే.. ఆ పరిణామాలను గమనించి ఎంపిక చేయాలని ఆచితూచి అడుగులు వేస్తున్నారు.  కాంగ్రెస్​లో పోటీ ఎక్కువగా ఉన్నందున ఆపార్టీలో టికెట్​దక్కనివారు బీఆర్‌‌ఎస్​ వైపు వచ్చే అవకాశం కొట్టిపారేయలేమని అనుకుంటున్నారు.

అదే విధంగా కాంగ్రెస్​ఎంపిక చేసిన అభ్యర్థి కులం ఆధారంగా చేసుకొని అదే కులానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేయాలని భావిస్తున్నారు.  తద్వారా మున్సిపాలిటీల్లో చైర్మన్​ సీట్లను కైవసం చేసుకొని బీఆర్‌‌ఎస్ క్యాడర్‌‌ను నిలబెట్టుకోవాలని చూస్తున్నారు.