యాదాద్రి, వెలుగు : దశాబ్దకాలం తర్వాత బస్వాపురం(నృసింహ సాగర్) రిజర్వాయర్ నుంచి చెరువులకు సాగు నీరు విడుదలైంది. రిజర్వాయర్ వద్ద పూజలు చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డి సోమవారం నీరు విడుదల చేసి మాట్లాడారు. గత సర్కారు హయాంలో ఈ రిజర్వాయర్ను పట్టించుకోలేదన్నారు.
తమ ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత భూ సేకరణ ఆటంకాలను తొలగిస్తూ వచ్చామని, పరిహారం కూడా క్రమక్రమంగా అందిస్తున్నామని తెలిపారు. భువనగిరి మీదుగా వెళ్లే నేషనల్ హైవే కింది నుంచి కాలువ తీయకపోవడంతో ఇప్పటివరకూ నీటి విడుదల ఆలస్యం జరిగిందని చెప్పారు. వీటికి సంబంధించి అన్ని అనుమతులు తీసుకొని పనులు చేయించామని చెప్పారు. మెయిన్ కాల్వ పూర్తి కావడంతో బస్వాపురం రిజర్వాయర్ నీటిని విడుదల చేశామన్నారు. భువనగిరి, వలిగొండ మండలాల్లోని చెరువులు నిండుతాయని తెలిపారు.
