వికారాబాద్, వెలుగు: చిట్టీల పేరుతో ఓ వ్యాపారీ పలువురి వద్ద రూ.కోట్లలో వసూలు చేసి పరారయ్యాడు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాండూరు పట్టణంలోని మార్వాడీ బజార్కు చెందిన గోపాల్స్థానిక రైల్వేస్టేషన్ మార్గంలో మెడికల్ షాప్తో పాటు ఏజెన్సీ నడుపుతున్నాడు. వీటికి తోడు చిట్టీల వ్యాపారం కూడా ప్రారంభించాడు.
వ్యాపారీగా పేరు ఉండడంతో ఆయన వద్ద వందకు పైగా ప్రజలు చిట్టీలు వేశారు. ఒక్కొక్కరి వద్ద రూ.లక్షల్లో వసూలు చేశాడు. ఇలా రూ.13 కోట్ల వరకు వసూలు కాగా, దీపావళి మరుసటి రోజు కుటుంబంతో సహా పరారయ్యాడు. వారం రోజులుగా గోపాల్ అందుబాటులోకి రాకపోవడంతో చిట్టీలు వేసిన వారు ఆందోళన చెందుతున్నారు. పలువురు బాధితులు తమకు న్యాయం చేయాలంటూ తాండూరు పోలీస్టేషన్ను ఆశ్రయిస్తున్నారు.
