నూక శాతం లెక్కింపు షురూ
హైదరాబాద్, వెలుగు: యాసంగి వడ్లలో నూక శాతం లెక్కించేందుకు కార్యాచరణ షురూ అయింది. 20వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఎంపిక చేసిన 11 రైస్ మిల్స్లో టెస్ట్ మిల్లింగ్ నిర్వహించేందుకు మైసూర్కు చెందిన సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీఎఫ్టీఆర్ఐ) రంగం సిద్ధం చేస్తోంది. ఈ రీసెర్చ్ బృందం 2రకాల వడ్లను ఎంచుకుంది. ఇందులో అత్యధికంగా సాగు చేసే వెయ్యి పది ( ఎంటీయూ 1010 )తో పాటు మరో లోకల్ రకం వడ్లను ఎంపిక చేసింది. టెస్ట్ మిల్లింగ్ కోసం ఎంపిక చేసిన మిల్స్లో ఈ 2 రకాల ధాన్యాన్ని ఆ మిల్లు సామర్థ్యానికి 5 రెట్లు అధికంగా ధాన్యాన్ని అందుబాటులో ఉంచాలని సీఎఫ్టీఆర్ఐ రాష్ట్ర సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్కు సమాచారం అందించింది.
యాసంగిలో పండిన వడ్లు ఎక్కువగా నూక అవుతోందని కొన్నేండ్లుగా బాయిల్డ్ రైస్ చేస్తూ వస్తున్నారు. కేంద్రం రా రైస్ మాత్రమే తీసుకుంటామని ఇప్పటికే తేల్చి చెప్పింది. దీంతో రాష్ట్ర సర్కారు నూక శాతం నష్టాన్ని భరించి రా రైస్ ఇవ్వాలని నిర్ణయించింది. దీని కోసం సీఎస్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ నూక శాతాన్ని తేల్చే బాధ్యతను మైసూర్లోని సీఎఫ్టీఆర్ఐకి అప్పగించింది. ఇప్పటికే మైసూరు నుంచి వచ్చిన బృందం జిల్లాల నుంచి ధాన్యం శాంపిల్స్ సేకరించి మైసూర్లో టెస్టింగ్ నిర్వహించింది. తాజాగా ఇక్కడ మళ్లీ టెస్ట్ మిల్లింగ్ చేసి ఈ రెండింటి రిజల్స్ట్ను ఎనాలసిస్ చేసి నూక శాతాన్ని ప్రకటిస్తుంది.
టెస్టింగ్ నిర్వహించే 11 మిల్లులు ఇవే..
నిర్మల్ జిల్లాలో సత్యనారాయణ ఆగ్రో ఇండస్ట్రీస్, కరీంనగర్ జిల్లాలో లక్ష్మి పీవీఆర్ఎం, వరంగల్ జిల్లాలో మణికంఠ ఆగ్రో ఇండస్ట్రీ, యాదాద్రిలో యాదాద్రి రైస్ ఇండస్ట్రీ, ఖమ్మంలో కస్తూరి ట్రేడింగ్ కంపెనీ, నల్గొండలో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర రైస్ ఇండస్ట్రీ, వనపర్తి జిల్లాలో శ్రీ రాజరాజేశ్వరీ ఇండస్ట్రీ, జగిత్యాలలో ఆంజనేయ రైస్ ఇండస్ట్రీ, నిజామాబాద్ జిల్లాలో శ్రీ త.నరిసింహ స్వరూప్ ఆగ్రో ఇండస్ట్రీ , కామారెడ్డి జిల్లాలో గజాణన ఇండస్ట్రీస్ , సిద్దిపేటలో శ్రీ శ్రీనివాస ఆగ్రో ఇండస్ట్రీలను ఎంపిక చేశారు.