న్యూఢిల్లీ: ఎన్ఎస్ఇ కో-–లొకేషన్ స్కామ్ కేసుకు సంబంధించి సీబీఐ శనివారం పలు నగరాల్లోని 10కి పైగా చోట్ల సెర్చ్ ఆపరేషన్లను మొదలు పెట్టింది. ముంబై, గాంధీనగర్, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ కోల్కతా వంటి నగరాల్లోని 12 బ్రోకర్ల ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ కేసులో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ సీఈవో, ఎండీ చిత్రా రామకృష్ణ, గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్లపై చార్జిషీట్ దాఖలు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. 2010– 2015 వరకు ఆమె ఎన్ఎస్ఈ చీఫ్గా పనిచేశారు. ఈ కేసు నిందితులలో ఒకరైన ఒపిజి సెక్యూరిటీస్ ‘ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్’ సెగ్మెంట్ సెకండరీ పిఓపి సర్వర్కు కనెక్ట్ అయినట్లు దర్యాప్తులో తేలింది. రామకృష్ణ, సుబ్రమణియన్ల హయాంలో ఎన్ఎస్ఈ అధికారులు కొందరు బ్రోకర్లకు ప్రిఫరెన్షియల్ యాక్సెస్ ఇవ్వడంతో అక్రమంగా లాభాలు పొందారనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేసింది. చిత్రా రామకృష్ణ, సుబ్రమణియన్ను తన సలహాదారుగా నియమించుకున్నారు. ఆ తర్వాత గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ (జీఓఓ)గా ఏటా రూ. 4.21 కోట్ల జీతంతో పదోన్నతి ఇచ్చారు.