ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ప్రమాదం ముంచుకొస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జగన్ వైఖరితో ఏపీ తాగునీటి సంక్షోభం దిశగా పయనిస్తోందన్నారు. జల్ జీవన్ పథకం అమలులో ఏపీ 18వ స్థానంలో ఉందని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలకు ఇదొక ప్రబల నిదర్శనం అని చంద్రబాబు పేర్కొన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికీ పరిశుభ్రమైన తాగునీరు ఓ హక్కు అని, దీన్ని ఎవరూ కాలరాయలేరని స్పష్టం చేశారు. కానీ, ఏపీలో ప్రజలకు తాగునీరు వంటి ప్రాథమిక వసతిని కూడా అందించలేని అసమర్థ ప్రభుత్వాన్ని జగన్ నడిపిస్తున్నాడని చంద్రబాబు విమర్శించారు. ఏపీకి మెరుగైన నాయకత్వం అవసరం అని స్పష్టం చేశారు.