సాగు భూముల్లో కందకం పనులు .. ఫారెస్ట్ అధికారులు, రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం

సాగు భూముల్లో కందకం పనులు .. ఫారెస్ట్ అధికారులు, రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం

ఖానాపూర్, వెలుగు: కందకం పనులను అడ్డుకోవడంతో  రైతులకు, ఫారెస్ట్ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నిర్మల్​జిల్లా ఖానాపూర్ మండలం తర్లపాడ్ శివారులోని సాగు భూముల్లో స్థానిక అటవీ అధికారులు ప్లాంటేషన్ పనుల పేరిట బుధవారం జేసీబీలతో కందకం పనులను చేపట్టారు. రైతులు వెళ్లి అడ్డుకుని.. కొన్నేండ్లుగా పోడు భూముల్లో సాగు చేస్తున్నామని, ఇప్పుడు ప్లాంటేషన్ పనులు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమ భూముల్లోనుంచి వెళ్లిపోవాలని రైతులు కోరారు.

 అక్కడి నుంచి అటవీ అధికారులు నిరాకరించారు. దీంతో రైతులకు, కమ్యూనిస్టు నేతలు మద్దతుగా వచ్చి అధికారులతో వాగ్వాదా నికి దిగారు. ఖానాపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ఎఫ్ డీపీటీ శాంతారాం ఆదేశాల మేరకే  కందకం పనులు చేస్తున్నామని వివరించారు. గిరిజనేతరుల పోడు భూముల్లోనే  పనులు చేస్తున్నామని, దీనిపై కొందరు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. డిప్యూటీ రేంజర్ మహేశ్, ఖానాపూర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రవీందర్, సిబ్బంది నరేందర్ ఉన్నారు. 

పేద రైతులపై దౌర్జన్యం దారుణం 

ఖానాపూర్ ఫారెస్ట్ డివిజన్ పరిధి కడెం, పెంబి, ఉడుంపూర్ ఫారెస్ట్ రేంజ్ లోని పోడు భూముల్లో సాగు చేసుకునే పేద రైతులపై ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యానికి పాల్పడి వేధింపులకు గురిచేస్తున్నారని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఖానాపూర్ లో వారు మీడియాతో మాట్లాడుతూ.. తర్లపాడ్ లోని రైతుల భూముల్లో ప్లాంటేషన్ పేరిట కందకం పనులు చేయడం సిగ్గు చేటని విమర్శించారు. పోడు భూముల్లో సాగు రైతులకు వెంటనే ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అటవీ శాఖ ప్లాంటే షన్ పనులను ఆపాలని కోరారు.