- అధికారులు, ఇంజనీర్లకు సీఎం కేసీఆర్ ఆదేశం
- ఆదివారం మళ్లీ చర్చిద్దామని సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి కృష్ణా, గోదావరి నదుల్లో హక్కుగా దక్కే నీటి వాటాలపై బోర్డు సమావేశాల్లో గట్టిగా పట్టుబట్టాలని, తెలంగాణ వాణి వినిపించాలని అధికారులు, ఇంజనీర్లను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ధారిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినందున రాష్ట్రం అనుసరించాల్సిన వ్యూహాలపై శుక్రవారం ప్రగతి భవన్లో సమీక్షించారు. బచావత్, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునళ్లు కృష్ణాలో తెలంగాణకు హక్కుగా కేటాయించిన నీటి వాటాలపైనా రివ్యూ చేశారు. రాష్ట్ర సాగునీటి హక్కులు, రైతుల ప్రయోజనాలు కాపాడే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం అన్నారు. ఇందుకు తగ్గట్టుగా ప్రభుత్వ అధికార యంత్రాంగం పట్టుదలతో కృషి చేయాలని సూచించారు. త్వరలో కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశాలు నిర్వహిస్తున్నందున ఆ సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడాలని ఆయన ఆదేశించారు. ఇదే అంశంపై చర్చించేందుకు ఆదివారం తిరిగి సమావేశమవుదామని చెప్పారు.