
- ఫోన్ చేసిన కేంద్ర మంత్రి బండి
కరీంనగర్, వెలుగు : సర్కార్ హాస్పిటల్లో నాసల్ సర్జరీ చేయించుకున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిని సీఎం రేవంత్రెడ్డి అభినందించారు. ‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధునిక సదుపాయాలు, అనుభవం ఉన్న వైద్యులు, సేవా దృక్పథం ఉన్న సిబ్బంది ఉన్నారు. సర్కారు దవాఖానలో నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్న నమ్మకం మాత్రమే ఇప్పుడు కావాలి. శస్త్రచికిత్స చేయించుకుని ఆ నమ్మకాన్ని కలిగించిన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి నా అభినందనలు’ అని ట్వీట్ చేశారు. ఈ పోస్ట్కు వీ6 వెలుగు కథనాన్ని ట్యాగ్ చేశారు.
ఫోన్లో మాట్లాడిన బండి సంజయ్
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ అభినందించారు. కలెక్టర్ సర్కార్ హాస్పిటల్లో నాసల్ సర్జరీ చేయించుకోవడంతో బండి సంజయ్ సోమవారం కలెక్టర్కు ఫోన్ చేసి మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ‘కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉన్నా.. ప్రభుత్వ హాస్పిటల్లోనే సర్జరీ చేయించుకోవడం అభినందనీయం. ఆధునిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్న సర్కారీ దవాఖానాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుతాయనే నమ్మకం కలిగించినందుకు నా ప్రత్యేక అభినందనలు’ అని బండి సంజయ్ చెప్పారు.