కామారెడ్డి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో భిక్కనూరు, మద్నూర్, ఎల్లారెడ్డి మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతిపై జిల్లా అధికారులు, ఎంపీడీవోలతో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ఇసుక, మొరం కొరత ఏర్పడకుండా చూడాలన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా లోన్లు ఇప్పించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర మదన్మోహన్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ తదితరులు పాల్గొన్నారు.
చీరల పంపిణీ పకడ్బందీగా చేపట్టాలి
జిల్లాలో చీరల పంపిణీ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. బుధవారం సీఎం రేవంత్రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ.. డిసెంబర్ 9 వరకు చీరల పంపిణీ జరుగుతుందన్నారు. వివాదాలకు తావులేకుండా చీరల పంపిణీ పారదర్శకంగా చేపట్టాలన్నారు. సివిల్ సప్లయ్ అధికారుల డేటా ప్రకారం 18 ఏండ్లు పైబడిన వాళ్లు జిల్లాలో 3,11,922 మంది మహిళలు అర్హులుగా ఉన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు విక్టర్, మదన్మోహన్, డీఆర్డీవో సురేందర్, డీపీవో మురళి, మహిళ సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.
