
కామారెడ్డి టౌన్, వెలుగు : అకాల వర్షాలకు కొనుగోలు సెంటర్లలో వడ్లు తడువకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. బుధవారం తన చాంబర్లో ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలని, సెంటర్లలో కొనుగోళ్లపై క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నారు. సెంటర్లలో త్వరగా కాంటా పెట్టి ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలించాలన్నారు.
2 లక్షల 57 వేల మెట్రిక్ టన్నుల వడ్లను ఇప్పటి వరకు కొనుగోలు చేశామని, ఇందులో దొడ్డు రకం లక్ష 7వేల మెట్రిక్ టన్నులు, సన్నరకం లక్షా50 వేల మెట్రిక్ టన్నులు ఉందన్నారు. ఇప్పటికే రూ.597 కోట్లు చెల్లించామని, సన్న రకం వడ్లకు రూ. 43 కోట్ల 17 లక్షలు బోనస్ చెల్లించినట్లు తెలిపారు. సమావేశంలో ఆర్డీవో వీణ, సివిల్ సప్లయ్ డీఎం రాజేందర్, డీఎస్వో మల్లికార్జునబాబు, డీసీవో రాంమోహన్, డీఏవో తిరుమల ప్రసాద్, డీఆర్డీవో సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఇష్టంతో చదవాలి
విద్యార్థులు ఇష్టంతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. ఇటీవల ప్రకటించిన ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షల్లో మైనార్టీ విద్యా సంస్థల్లో చదివి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కలెక్టర్ సన్మానించారు. జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి దయానంద్, ఆర్ఎల్సీ కిరణ్గౌడ్, ప్రిన్సిపాల్స్ ఇంతియాజ్, వెంకటరాములు, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
‘ఉపాధి’ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
కామారెడ్డిటౌన్, వెలుగు : ఉపాధి హామీ పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. బుధవారం తన చాంబర్లో డీఆర్డీవో, ఇతర అధికారులతో రివ్యూ మీటింగ్లో మాట్లాడారు. గ్రామ పంచాయతీ , అంగన్వాడీ బిల్డింగ్లు, స్కూల్స్లో టాయిలెట్స్ నిర్మాణం, సీసీ రోడ్లు, ఫామ్ఫండ్స్ పనులకు ప్రతిపాదనలు రెడీ చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ చందర్, డీఆర్డీవో సురేందర్, డీపీవో మురళీ తదితరులు పాల్గొన్నారు.