భద్రాచలం టీసీఆర్ అండ్ టీఐ ఆఫీస్ తరలించేందుకు యత్నం!

భద్రాచలం టీసీఆర్ అండ్ టీఐ ఆఫీస్ తరలించేందుకు యత్నం!

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం ఐటీడీఏలోని టీసీఆర్​అండ్​ టీఐ( ట్రైబల్​ కల్చర్​ రీసెర్చ్​ అండ్​ ట్రైనింగ్​ ఇనిస్టిట్యూషన్​)  ఆఫీస్​ను హైదరాబాద్​కు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఆఫీస్​లో పనిచేసే సిబ్బందికి పనిలేదని ఎంప్లాయీస్​ను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని ట్రైబల్​ వెల్ఫేర్​ కమిషనర్​కు గతంలో కొందరు లేఖ రాశారు. అప్పుడే ఒక టీమ్​ వచ్చి దీనిపై విచారణ జరిపింది. తిరిగి ఇటీవలే డిప్యుటేషన్​పై వెళ్లిన ఈ శాఖకు చెందిన మరో ఉద్యోగి ఈ వ్యవహారాన్ని కమిషనర్​కు గురుతచేశారు. 

ఈ అంశంపై వివరణ కావాలంటూ తాజాగా ఐటీడీఏలోని డీడీ ఆఫీసుకు ఉత్తర్వులు వచ్చాయి. టీసీఆర్​అండ్ టీఐ ఆఫీసులో జేడీ, సూపరింటెండెంట్, సీనియర్, జూనియర్, రికార్డు అసిస్టెంట్లు, ఫోర్త్ క్లాస్​ ఎంప్లాయీస్​ మొత్తం 14 పోస్టులు ఉన్నాయి. జేడీ పోస్టు ఖాళీగా ఉండటంతో ఐటీడీఏ డీడీనే ఇన్​చార్జ్​గా వ్యవహరిస్తున్నారు. కొందరు డిప్యూటేషన్లపై వెళ్లగా, ఉన్న మరికొందరు ఐటీడీఏలోనే వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆఫీస్​ తరలింపు అంశం కలకలం రేపుతోంది. 

ఆఫీస్​ తరలించడం సబబు కాదని సీపీఐ ఎంఎల్​  అంటోంది. భద్రాచలం ప్రాంత ఆదివాసీ సంస్కృతిని కాపాడాలని,  ఆఫీస్​ తరలించడం పట్ల భద్రాచలం ప్రాంతానికి తీరని నష్టం వాటిల్లుతుందని  పేర్కొంది. కాగా ఈ విషయమై ఐటీడీఏ డీడీ మణెమ్మ మాట్లాడుతూ ఆఫీస్​ఉంచాలా ? వద్దా..? అనే అంశంపై తనను అభిప్రాయం అడిగారని, ఎట్టిపరిస్థితుల్లోనూ తరలించొద్దని తాను సూచిస్తున్నట్లు ఆమె తెలిపారు.