
భద్రాచలం, వెలుగు : భద్రాచలం ఐటీడీఏలోని టీసీఆర్అండ్ టీఐ( ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూషన్) ఆఫీస్ను హైదరాబాద్కు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఆఫీస్లో పనిచేసే సిబ్బందికి పనిలేదని ఎంప్లాయీస్ను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్కు గతంలో కొందరు లేఖ రాశారు. అప్పుడే ఒక టీమ్ వచ్చి దీనిపై విచారణ జరిపింది. తిరిగి ఇటీవలే డిప్యుటేషన్పై వెళ్లిన ఈ శాఖకు చెందిన మరో ఉద్యోగి ఈ వ్యవహారాన్ని కమిషనర్కు గురుతచేశారు.
ఈ అంశంపై వివరణ కావాలంటూ తాజాగా ఐటీడీఏలోని డీడీ ఆఫీసుకు ఉత్తర్వులు వచ్చాయి. టీసీఆర్అండ్ టీఐ ఆఫీసులో జేడీ, సూపరింటెండెంట్, సీనియర్, జూనియర్, రికార్డు అసిస్టెంట్లు, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ మొత్తం 14 పోస్టులు ఉన్నాయి. జేడీ పోస్టు ఖాళీగా ఉండటంతో ఐటీడీఏ డీడీనే ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. కొందరు డిప్యూటేషన్లపై వెళ్లగా, ఉన్న మరికొందరు ఐటీడీఏలోనే వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆఫీస్ తరలింపు అంశం కలకలం రేపుతోంది.
ఆఫీస్ తరలించడం సబబు కాదని సీపీఐ ఎంఎల్ అంటోంది. భద్రాచలం ప్రాంత ఆదివాసీ సంస్కృతిని కాపాడాలని, ఆఫీస్ తరలించడం పట్ల భద్రాచలం ప్రాంతానికి తీరని నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. కాగా ఈ విషయమై ఐటీడీఏ డీడీ మణెమ్మ మాట్లాడుతూ ఆఫీస్ఉంచాలా ? వద్దా..? అనే అంశంపై తనను అభిప్రాయం అడిగారని, ఎట్టిపరిస్థితుల్లోనూ తరలించొద్దని తాను సూచిస్తున్నట్లు ఆమె తెలిపారు.