హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. మంగళవారం ఆయన కరోనా రికవరీ గురించి పవర్ ప్రజెంటేషన్ ద్వారా మీడియాకు తెలిపారు. సెకండ్ వేవ్ ప్రారంభంలో కరోనా కేసులు వేగంగా పెరిగాయని అయితే.. లాక్ డౌన్ తో పాజిటివ్ ఫలితాలు వస్తున్నాయన్నారు. సెకండ్ వేవ్ లో 80 శాతం మంది కోలుకున్నట్లు చెప్పారు. అవసరం ఉన్న దగ్గరే పరీక్షలు నిర్వహిస్తున్నామని.. హౌస్ హోల్డ్ సర్వే మంచి ఫలితాలనిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18 రోజుల్లో 50 శాతం కరోనా కేసులు తగ్గాయని తెలిపారు. ఈ రోజు వరకు ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో చాలా వరకు బెడ్లు అందుబాటులో ఉన్నాయంటే రికవరీ రేటు అర్ధం చేసుకోవచ్చన్నారు.
కరోనా తగ్గుతుంది కదా అని అజాగ్రత్తగా ఉండొద్దని సూచించారు డీహెచ్. హైదరాబాద్ లో మెడికల్ సదుపాయం ఎంతో పెద్దదని.. చుట్టు పక్కన ఉన్న 5 రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్ లోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్ మెంట్ తీసుకుని కోలుకున్నట్లు తెలిపారు. దీంతో హైదరాబాద్ మెడికల్ హబ్ గా మారిందని చెప్పారు. అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో బ్లాక్ ఫంగస్ మందులు ఉన్నాయని తెలిపారు. ప్రజల సహకారంతో నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్ లో కరోనా తగ్గుతుందన్నారు. ప్రభుత్వ, ప్రవేట్ హాస్పిల్స్ లో ఆక్సీజన్ అందుబాటులో ఉందని..కొన్ని వారాల్లో కరోనా పూర్తిగా కంట్రోల్ లోకి వస్తుందన్నారు. సెకండ్ డోస్ వ్యాక్సిన్ చాలా మందికి వేయాల్సి ఉందని.. అయితే కేంద్రం నుంచి వ్యాక్సిన్ రాగానే పూర్తి చేస్తమన్నారు. కరోనా చికిత్సలో తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా ఉందని తెలిపారు డీహెచ్ శ్రీనివాసరావు.
మీడియా గురించి మాట్లాడిన డీహెచ్..మసాలా కాస్త తక్కువగా ఉండాలన్నారు. ప్రజలను భయపెట్టేలా వార్తలు ఉండకూడదని.. ప్రెస్ మీట్ లో హెల్త్ డైరెక్టర్ ఇలా అన్నారంటూ పెద్ద పెద్ద హెడ్డింగులు దయచేసి పెట్టకండి అన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కరోనా కేసులు తక్కువ చూపిస్తున్నామంటూ వార్తలు వస్తున్నాయని చెప్పారు. మన ప్రభుత్వానికి అలాంటి ఆలోచన లేదన్నారు. దయచేసి మీడియా ఉన్నది ఉన్నట్టు రాయాలని తెలిపారు హెల్త్ డైరెక్టర్.