సర్కారు తప్పుడు లెక్కలు
దవాఖాన్లలో 28 వేలకు పైగా రోగులు
రెండ్రోజుల్లో 11,451 మందికే పాజిటివ్ అంటూ రిపోర్ట్
87 మంది మృతి అని వెల్లడి
ఇక నుంచి మాపటీలే బులెటిన్ విడుదల
హైదరాబాద్, వెలుగు: కరోనాతో జనాలు అల్లాడుతుంటే రాష్ర్ట సర్కార్ మాత్రం తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. హెల్త్బులెటిన్లో కేసులు, మరణాల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నా.. ఆస్పత్రుల్లో మాత్రం రోజురోజుకూ కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. రెండ్రోజుల్లో 1,550 మంది కరోనా పేషెంట్లు ట్రీట్మెంట్ కోసం దవాఖాన్లలో చేరారు. దీంతో మొత్తం ఇన్పేషెంట్ల సంఖ్య 28 వేలు దాటింది. ఇందులో 8,266 మంది సీరియస్ కండీషన్లో ఐసీయూలో ఉంటే, 14,029 మంది ఆక్సిజన్ సపోర్ట్పై ఉన్నారు. ఇంకో 5,849 మంది మామూలు లక్షణాలతో నార్మల్ బెడ్లపై ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. రోజూ కరోనా పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నా.. బులెటిన్లో మాత్రం తక్కువగా ఉంటుండడం గమనార్హం.
బులెటిన్.. ఇక నుంచి మాపటీలే
రోజూ ఉదయం 8 గంటలకు విడుదల చేస్తున్న కరోనా బులెటిన్ను ఇక నుంచి సాయంత్రం 6 గంటలకు ఇస్తామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను రోజూ సాయంత్రం ప్రెస్మీట్ పెట్టి వెల్లడిస్తామన్నారు. ఈ నిర్ణయంతో శుక్రవారం సాయంత్రం బులెటిన్ను విడుదల చేశారు. గురువారం, శుక్రవారం కేసులను కలిపి వెల్లడించారు. ఈ రెండ్రోజుల్లో 11,451 కేసులు నమోదైనట్టు బులెటిన్లో పేర్కొన్నారు. గురువారం 76,047 మందికి టెస్ట్ చేస్తే 5,892 మందికి, శుక్రవారం 65,375 టెస్టులకుగానూ 5,559 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చినట్టు ప్రకటించారు. మొత్తంగా ఈ రెండు రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్లో 2,088, జిల్లాల్లో 9,363 కేసులు వచ్చినట్టు చూపించారు. వీటితో కలిపి రాష్ర్టంలో కరోనా బాధితుల సంఖ్య 4,87,199కి పెరిగింది. అందులో 4,13,225 మంది కోలుకున్నారన్నారు. ప్రస్తుతం 71,308 మంది కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు చెప్పారు. కరోనాతో గురువారం 46 మంది, శుక్రవారం 41 మంది చనిపోయారని, మొత్తం మరణాలు 2,666కు పెరిగాయని బులెటిన్లో వెల్లడించారు.
గాంధీ డాక్టర్లు మంచిగ పనిచేస్తున్నరు
కరోనా వార్డులు, ఆక్సిజన్ ప్లాంటును పరిశీలించిన సీఎస్ పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రిలో కరోనా పేషెంట్లకు డాక్టర్లు మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారని, వారి సేవలు బాగున్నాయని సీఎస్ సోమేశ్ కుమార్ కొనియాడారు. శుక్రవారం ఆయన గాంధీ ఆస్పత్రిలో కరోనా ట్రీట్మెంట్ తీరును పరిశీలించారు. మెడికల్ కాలేజ్ లైబ్రరీ బిల్డింగ్లో పేషెంట్ల కోసం ఏర్పాటు చేసిన 160 బెడ్ల కొత్త వార్డు, రోజూ 4 టన్నుల ఆక్సిజన్ను తయారు చేసే ఆక్సిజన్ ప్లాంట్, ఓపీ బ్లాక్లో ఆక్సిజన్ పైప్లైన్ పనులను పరిశీలించారు. కొత్త ఆక్సిజన్ ప్లాంట్తో రోజూ 400 మంది పేషెంట్లకు ఆక్సిజన్ను అందించొచ్చని సీఎస్కు గాంధీ సూపరింటెండెంట్ రాజారావు వివరించారు. ఓపీ బ్లాక్లో ఏర్పాటు చేస్తున్న పైప్లైన్ ద్వారా కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ను అందిస్తామని చెప్పారు.