
- ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళలో ఒకరు చొప్పున మృతి
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 203 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేలకు చేరింది. అలాగే గత 24 గంటల్లో ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళలో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కేరళ (1,435), మహారాష్ట్ర (506), ఢిల్లీ (483), గుజరాత్ (338) పై ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొంది.
వెస్ట్ బెంగాల్ 338, కర్నాటక 253, తమిళనాడు 189, ఉత్తరప్రదేశ్ 157 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయని, ఆ రాష్ట్రాల్లోనూ పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నామని హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. రాజస్థాన్ లో 69, పుదుచ్చేరిలో 38, హర్యానాలో 28 యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించింది.
ఢిల్లీలోని డాక్టర్ ఆర్ఎంఎల్ హాస్పిటల్ లో నలుగురు చికిత్స పొంది పూర్తిగా రికవర్ అయ్యారని, వారిని డిశ్చార్జి చేశామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదైన కేసులన్నీ మైల్డ్ కేసులే అని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కొవిడ్ లక్షణాలు కనిపిస్తే, వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచించారు.