అబుదాబీ: ఐపీఎల్ టోర్నీలో అదరగొడుతున్న కుర్రాళ్లు సీనియర్ల రికార్డులు బ్రేక్ చేస్తూ మ్యాచులపై క్రేజ్ పెంచుతున్నారు. డిల్లీ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వీరేంద్ర సెహ్వీగ్ పేరిట చాలాకాలంగా ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. గతంలో ఢిల్లీ డేర్డెవిల్స్ పేరుతో ఉన్న ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున వీరేంద్ర సెహ్వాగ్ 85 ఇన్నింగ్స్ ఆడి 2382 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. అయితే నిన్న మంగళవారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్ పంత్ 39 పరుగులు చేసి సెహ్వాగ్ రికార్డును అధిగమించాడు.
రిషబ్ పంత్ ఢిల్లీ తరఫున ఇప్పటి వరకు మొత్తం 75 ఇన్నింగ్స్ లో 2390 పరుగులు చేసి సెహ్వాగ్ను వెనక్కి నెట్టి ఇంకా పైపైకి వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. అటు కీపర్ గా.. ఇటు హిట్టర్ గా మంచి ఫామ్ తో తనదైన ముద్ర వేస్తున్న కెప్టెన్ రిషబ్ పంత్ ఐపీఎల్ మ్యాచుల్లో మరిన్ని రికార్డులు తిరగరాసే దిశలో దూసుకెళ్తున్నాడు. రిషబ్ పంత్ ఖాతా ఇప్పటి వరకు ఒక సెంచరీ, 14 హాఫ్ సెంచరీలు చేయగా.. రిటైర్ అయిన వీరేంద్ర సెహ్వాగ్ ఒక సెంచరీ, 17 అర్ధ సెంచరీలు చేశాడు. ఢిల్లీ జట్టు తరపున అత్యధిక పరుగుల రికార్డు చాలాకాలంగా సెహ్వాగ్ పేరిట కొనసాగుతూ ఉండగా తాజాగా పంత్.. సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేశాడు. పంత్, సెహ్వాగ్ ల తర్వాత ఢిల్లీ తరఫున అత్యధిక పరుగుల రికార్డు రేసులో శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ ఇప్పటి వరకు 82 ఇన్నింగ్స్ లో 2291 పరుగులు చేశాడు.