
అయ్యప్ప జన్మ వృత్తాంతం, భక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వరంగల్ జిల్లాకు చెందిన బైరి నరేశ్ ను కఠినంగా శిక్షించాలని రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్ప స్వాములు డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా జగిత్యాల పట్టణంలోని అయ్యప్ప ఆలయం వద్ద అయ్యప్ప స్వామి దీక్షపరులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వారి నిరసనకు స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మద్దుతు తెలిపారు. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సదరు వ్యక్తిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కోట్లాది మంది భక్తులు అయ్యప్పస్వామిని కొలుస్తారని, భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు. దేశంలో మతతత్వ స్వేచ్ఛ హక్కు ఉందని, ఇతర మతస్తులను కించపరిచే విధంగా మాత్రం వ్యవహరించకూడదని సంజయ్ కుమార్ సూచించారు.
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యల సంఘటన పై సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అతని పై కఠిన చర్యలు తీసుకుని అరెస్ట్ చేసి శిక్షించాలంటూ సూర్యాపేట, హైదరాబాద్ , విజయవాడ రహదారి NH 65 పై అయ్యప్ప స్వాములు ఆందోళన చెపట్టారు. దీంతో అక్కడ ట్రాఫిక్ భారీగా స్తంభించింది.
హిందు దేవుళ్లని కించపర్చేలా మాట్లాడిన బైరి నరేష్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ లో అయ్యప్ప భక్తుల బైక్ ర్యాలీ- రాస్తారోకో నిర్వహించారు. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అయ్యప్ప భక్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో నరేష్ పై ఫిర్యాదు చేశారు.