హైదరాబాద్ లోని హబీబ్నగర్ రౌడీషీటర్ ఖైజర్ 'పహెల్వాన్'పై ఎన్ఫోర్స్మెంట్ కేసు సమాచార నివేదిక (ఈసీఐఆర్) దాఖలైంది. అతనిపై విచారణ ప్రారంభించాలని హైదరాబాద్ పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు లేఖ రాశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సందీప్ శాండిల్య దర్యాప్తు ప్రారంభించి పలు క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. విచారణలో ఖైజర్ అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
అక్టోబర్ 26న హబీబ్నగర్ పోలీసులు ఖైజర్పై కేసు నమోదు చేసి పట్టుకున్నారు. అతను అనేక క్రిమినల్ కేసుల్లో అతని ప్రమేయం ఉందని, ఓ ముఠాను కూడా నిర్వహిస్తున్నాడని ఆరోపించారు. ఈ క్రమంలో పీడీ యాక్ట్ కింద అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖైజర్ పిక్ పాకెటింగ్, దొంగతనాలతో నేర కార్యకలాపాలను ప్రారంభించాడు. ఆ తర్వాత 1995లో వ్యక్తిగతంగా ఉన్న పగతో నాంపల్లిలోని గూడ్షెడ్లో అఫ్జల్ను హత్య చేశాడు.
అనంతరం కొద్ది కాలంలోనే బెయిల్పై జైలు నుంచి విడుదలైన తర్వాత ఓ ముఠాగా ఏర్పడి అమాయకులను బెదిరించడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు భూకబ్జాలు, దోపిడీలు లాంటి తదితర 22 క్రిమినల్ కేసుల్లో అతని ప్రమేయం ఉందని.. తన అక్రమ కార్యకలాపాలతో దాదాపు రూ. 100 కోట్లు సంపాదించాడని పోలీసులు తెలిపారు.
ఖైజర్ సంపాదించిన ఆస్తిలో ఇళ్లు, రిసార్ట్, హోటళ్లు మొదలైనవి ఉన్నాయి. అతని నేరపూరిత చర్యల కారణంగా, అతనిపై 2011 సంవత్సరంలో బహిష్కరణ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒక సంవత్సరం కాలపరిమితి ముగిసిన తర్వాత, అతను హైదరాబాద్కు తిరిగి వచ్చి, మళ్లీ తన నేర కార్యకలాపాలను ప్రారంభించాడు. 2014లో పీడీ చట్టం కింద నిర్బంధించి చర్లపల్లి జైలులో ఉంచారు. ఈక్రమంలోనే పోలీసులు ఇప్పుడు ఈ కేసును ఈడీకి రిఫర్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) ఫైల్ చేసింది.