- పార్టీ ఆఫీస్ వైపు కన్నెత్తి చూడని ముఖ్య నేతలు
హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్ వెలవెలబోయింది. మంగళవారం ఉదయం హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు నుంచి తుది ఫలితం తేలేదాకా కీలక నేతలెవరూ పార్టీ ఆఫీస్ వైపు కన్నెత్తి చూడలేదు. కార్పొరేషన్ల చైర్మన్లు కొందరే భవన్కు వచ్చారు. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలు సహా ఏ ఎన్నిక జరిగినా.. ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు భవన్లో ఎల్ఈడీ స్క్రీన్లు పెడతారు. సాంస్కృతిక వేడుకల కోసం కళాకారులను రప్పిస్తారు. పెద్ద ఎత్తున పటాకులు కాల్చేందుకు ఏర్పాట్లు చేస్తారు. కానీ, హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలకు మాత్రం భవన్లో అలాంటి ఏర్పాట్లేవీ చేయలేదు. ఫలితాలపై పార్టీ నాయకత్వానికి సమాచారం ఉండటంతోనే గెలుపు సంబురాలకు ఏర్పాట్లు చేయలేదని పలువురు నేతలు చర్చించుకోవడం కనిపించింది. గతంలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా పార్టీ ఆఫీస్లో ముఖ్య నేతలు ప్రెస్ మీట్ పెట్టేవారు. హుజూరాబాద్ ఫలితంపై మంత్రులు కేటీఆర్, హరీశ్రావు ట్వీట్లు మినహా నాయకులెవరూ మీడియాతో మాట్లాడలేదు.