ఇంజనీరింగ్  ఫీజులు డబుల్!

ఇంజనీరింగ్  ఫీజులు డబుల్!
  • వర్సిటీల ఎగ్జిక్యూటీవ్ కమిటీల ఆమోదంతో అమలు చేయాలని సూచన 
  • స్టూడెంట్లపై భారం పడదంటున్న అధికారులు 
  • ట్యూషన్ ఫీజు రూ.18 వేల నుంచి రూ.35 వేలకు పెంచాలని అడ్మిషన్ల కమిటీ ప్రపోజల్ 

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలోని సర్కార్ ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలోని సీట్ల ట్యూషన్​ఫీజు డబుల్ కానుంది. ప్రస్తుతం రూ.18 వేలు ఉన్న ట్యూషన్ ఫీజును రూ.35 వేలకు పెంచాలని ఎంట్రెన్స్ అండ్ అడ్మిషన్స్ (సెట్స్) కమిటీ ప్రతిపాదన చేసింది. దీన్ని అన్ని యూనివర్సిటీలు ఆయా వర్సిటీల ఎగ్జిక్యూటీవ్ కమిటీల ఆమోదంతో  అమలు చేయాలని సూచించింది. ఎగ్జిక్యూటీవ్ కమిటీల్లో సర్కార్ ప్రతినిధులు ఉండటంతో, ప్రత్యేకంగా ప్రభుత్వ అనుమతి అవసరం లేదని భావిస్తోంది. 
ఈసారి 4వేల సీట్లుండే చాన్స్.. 
రాష్ట్రంలో ఏడు యూనివర్సిటీల పరిధిలో 14 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా, వాటిలో 3,152 సీట్లు ఉన్నాయి. అయితే కొత్తగా ఈ ఏడాది సిరిసిల్ల ఇంజనీరింగ్ కాలేజీలో జేఎన్టీయూ అధికారులు అడ్మిషన్లు ప్రారంభిస్తున్నారు. ఇందులో ఆరు కోర్సులకు సర్కార్ అనుమతి ఇవ్వగా, వాటిలో 320 సీట్లు ఉండనున్నాయి. వీటితో పాటు ఓయూలో రెండు కొత్త కోర్సులు రానుండటంతో ఇంకో 120 సీట్లు, ఈడబ్ల్యూఎస్​కోటా కింద మరో 350 సీట్ల వరకు పెరిగే చాన్స్ ఉంది. ఈ లెక్కన సర్కార్ కాలేజీల్లో ఈ ఏడాది దాదాపు 4 వేల సీట్లుండే అవకాశముంది. ఇవన్నీ కూడా కన్వీనర్ కోటా ద్వారానే భర్తీ చేస్తారు. ప్రస్తుతం సర్కార్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన స్టూడెంట్లకు రూ.18 వేల ట్యూషన్  ఫీజు ఉంది. రూ.2 లక్షల లోపు ఆదాయం ఉండి, ఎంసెట్ లో 10 వేల లోపు ర్యాంకు సాధించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టూడెంట్లందరికీ సర్కారే ఫీజు చెల్లిస్తోంది. ఈ ట్యూషన్ ఫీజును పెంచాలని యూనివర్సిటీలు కొంతకాలంగా భావిస్తున్నప్పటికీ, అది అమలుకు నోచుకోలేదు. 
ఈ నెల 24 లోపు ప్రాసెస్ పూర్తవ్వాలె..  
వర్సిటీల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ట్యూషన్ ఫీజు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీనివల్ల స్టూడెంట్లపై పెద్దగా భారం పడబోదని, ఫీజు సర్కారే చెల్లిస్తుండడంతో ఇబ్బంది ఉండదని అంటున్నారు. సర్కార్ కాలేజీల్లో సీట్లు పొందే స్టూడెంట్లంతా దాదాపు10 వేల లోపు ర్యాంక్ వారే ఉంటారని పేర్కొంటున్నారు. వీరిలో ఎవరైనా రూ.2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నోళ్లు ఉంటే, వారిపైనే భారం పడుతుందన్నారు. ట్యూషన్ ఫీజు పెంపు ప్రపోజల్ కు వర్సిటీ ఎగ్జిక్యూటీవ్ కమిటీల్లో ఆమోదం తీసుకొని అమలు చేయాలన్న అడ్మిషన్ల కమిటీ.. ఆ ప్రాసెస్ ను ఈ నెల 24లోపే పూర్తి చేయాలని సూచించింది. దీంతో జేఎన్టీయూ, కేయూ, ఓయూతో పాటు మిగిలిన వర్సిటీలూ ఎగ్జిక్యూటీవ్ కమిటీ మీటింగ్ లు పెట్టే పనిలో ఉన్నాయి. ప్రస్తుతం స్టూడెంట్ల నుంచి వచ్చే ట్యూషన్ ఫీజులతోనే కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లకు జీతాలిస్తున్నామని ఓ యూనివర్సిటీ అధికారి చెప్పారు. ట్యూషన్ ఫీజు పెరిగితే జేఎన్టీయూహెచ్ కు ఎక్కువ లాభం చేకూరే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని సర్కార్ ఇంజనీరింగ్ కాలేజీలు (పోయినేడాది లెక్కల ప్రకారం) 
యూనివర్సిటీ    కాలేజీలు    సీట్లు 
జేఎన్టీయూ    4    1,468
కాకతీయ    3    825 
ఓయూ    2    440
మహాత్మాగాంధీ    1    180 
జేఎన్ఏఎఫ్ఏయూ    1    160 
అగ్రికల్చర్    2    57 
వెటర్నరీ    1    22 
మొత్తం    14    3,152