హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ వెలువరించిన తీర్పులను రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ వేసిన పిటిషన్లకు నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలను హైకోర్టు మరోసారి ఆదేశించింది. ఆ తర్వాత వారంలోగా పిటిషనర్లు రిప్లై కౌంటర్లు వేయాలని సూచించింది. తదుపరి విచారణను జూన్ 25కు వాయిదా వేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్రెడ్డి, కాలె యాదయ్య, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టి.ప్రకాశ్ గౌడ్, ఎ.గాంధీ, తెల్లం వెంకట్రావు, ఎం.సంజయ్ కుమార్లను అనర్హులుగా ప్రకటించాలన్న పిటిషన్లను స్పీకర్ కొట్టివేయడాన్ని సవాల్చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జి.జగదీశ్ రెడ్డి, కేపీ.వివేకానంద, కె.సంజయ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీహెచ్.ప్రభాకర్, పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం.మొహియుద్దీన్లతో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రతివాదుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. కౌంటర్లు దాఖలు చేయడానికి గడువు కావాలని కోరారు. దీనికి స్పందించిన న్యాయమూర్తులు నాలుగు వారాలు గడువు ఇస్తూ విచారణను వాయిదా వేశారు
