సోలార్ ఎనర్జీ వైపు వాటర్బోర్డ్ చూపు..రూ.383 కోట్లతో ఉత్పత్తికి సన్నాహాలు

సోలార్ ఎనర్జీ వైపు వాటర్బోర్డ్ చూపు..రూ.383 కోట్లతో ఉత్పత్తికి సన్నాహాలు
  • వచ్చే రూ.125 కోట్లలో రూ.100 కోట్లు కరెంట్​ బిల్లులకే  
  • భారం తగ్గించుకునేందుకు కొత్త ప్లాన్​ 
  • మొదటి దశలో మూడు ప్లేసుల్లో ప్లాంట్లు
  • 67.5 మెగావాట్ల​ఉత్పత్తికి రంగం సిద్ధం

హైదరాబాద్​సిటీ, వెలుగు: సోలార్​ఎనర్జీ ఉత్పత్తికి వాటర్​బోర్డు సన్నాహాలు చేస్తోంది. జంటనగరాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రధాన జలాశయాల నుంచి పెద్దమొత్తంలో నీటిని పంపింగ్​ ద్వారానే తరలిస్తోంది. దీంతో బోర్డుపై విద్యుత్​ బిల్లుల భారం పెరుగుతోంది. దీంతో సొంతంగా కొంత విద్యుత్​ను ఉత్పత్తి చేసుకునేందుకు అధికారులు కొన్నేండ్లుగా చేస్తున్న ప్రయత్నాలు త్వరలో కార్యరూపం దాల్చనున్నాయి.

ప్రస్తుతం నగరానికి ప్రధాన నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నుంచి కృష్ణా ప్రాజెక్టు మూడు దశలు​, కరీం నగర్​జిల్లాలోని ఎల్లంపల్లి నుంచి గోదావరి మొదటి దశ ప్రాజెక్టులతో పాటు మంజీరా నీటిని కూడా కొంత పంపింగ్​ద్వారానే తరలిస్తున్నారు. ఇలా రోజు 435 ఎంజీడీలను పంపింగ్​ ద్వారానే తీసుకువస్తోంది. దీంతో ప్రతి నెలా వాటర్​బోర్డుకు దాదాపు రూ.120 కోట్ల ఆదాయం వస్తుండగా, ఇందులో రూ. 100 కోట్లు నీటి బిల్లులకు సరిపోతోంది.

ఈ నేపథ్యంలో సొంతంగా సోలార్​పవర్​ను ఉత్పత్తి చేసేందుకు తెలంగాణ రెన్యువబుల్​ఎనర్జీ డెవలప్​మెంట్​కార్పొరేషన్​ (టీజీ రెడ్కో)తో సహకారంతో అధికారులు సొంతంగా ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు సక్సెస్​ అయితే బోర్డుకు 67.5 మెగావాట్ల​విద్యుత్​ ఉత్పత్తి సాధ్యమవుతుందని అధికారులు అంటున్నారు.  

టీజీ రెడ్కో సహకారంతో..

బోర్డుకు అనేక చోట్ల ఖాళీ భూములున్నాయి. వీటిలో కొన్ని చోట్ల సోలార్​ప్లాంట్లను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీని కోసం అధికారులు టీజీ రెడ్కోతో సమన్వయం చేసుకుని ప్రాజెక్టును చేపట్టబోతున్నారు. ​బోర్డుకు గోదావరి ప్రాజెక్టుకు చెందిన ముర్మూర్​ పంప్​ హౌస్​ వద్ద 60 ఎకరాలు, మల్లారం పంప్​ హౌస్​ ఉన్న సిద్ధిపేటలోని చిన్న కోడూరు వద్ద 80 ఎకరాలు, కొండపాక సబ్​స్టేషన్​ వద్ద 100 ఎకరాలు, మెదక్​ జిల్లాలోని పటాన్​చెరు వద్ద ఉన్న పెద్దాపూర్​ సబ్​స్టేషన్​ వద్ద 50 ఎకరాలు ఉన్నాయి.

మొదటి దశలో ఇక్కడ గ్రౌండ్​ మౌంటెడ్​ సోలార్​పవర్​ ప్లాంట్​ నిర్మించేందుకు ప్లాన్లు రూపొందించారు. దీనికి రూ.383 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్లాంట్ల ద్వారా 67.5 మెగావాట్ల విద్యుత్​ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. త్వరలో టెండర్లను ఆహ్వానించనున్నారు. కాగా, బోర్డు పరిధిలోని 72 ప్రాంతాల్లో ఖాళీ ప్రదేశాలు, కొన్ని చోట్ల రిజర్వాయర్లు ఉండగా, సోలార్​ఎనర్జీ ప్లాంట్లకు ఇవి అనుకూలంగా ఉన్నాయని అధికారులు అంటున్నారు. మొదటి దశలో ప్లాంట్ల ద్వారా విద్యుత్​ఉత్పత్తి వల్ల బోర్డు అవసరాలు కొంత వరకయినా తీరితే మరికొన్ని చోట్ల ప్లాంట్ల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసే అవకాశం ఉంది.