మూసీ వరద తగ్గింది కన్నీరు మిగిలింది.. బురద, నష్టంతో జనం ఇబ్బందులు

మూసీ వరద తగ్గింది  కన్నీరు మిగిలింది..  బురద, నష్టంతో జనం ఇబ్బందులు
  • ఇండ్లలో తడిసిన వస్తువులను చూసి బాధితుల కంటతడి
  • ఎంజీబీఎస్​ నుంచి యథావిధిగా బస్సుల రాకపోకలు
  • రోడ్లపై సైతం మోకాళ్లలోతు బురద
  • క్లీన్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీ జంట జలాశయాల నుంచి అవుట్ ఫ్లో తగ్గడంతో మూసీకి వరద తీవ్రత తగ్గింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో రెండ్రోజులపాటు మూసీ ఉధృతంగా ప్రవహించింది. శనివారం అర్ధరాత్రి వరకు భారీగా వరద కొనసాగింది.  సాయంత్రానికి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లోకి వరద తగ్గింది.

అప్పటి నుంచే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లోపల వరద ప్రవాహానికి కొట్టుకొచ్చిన బురద, చెట్లను తొలగించే పనులు అర్ధరాత్రి వరకు కూడా కొనసాగించారు. అంతా క్లియర్ కావడంతో ఆదివారం ఉదయం నుంచి ఎంజీబీఎస్​నుంచి యథావిధిగా బస్సులు నడిచాయి.

ఇండ్లలోకి చేరుకున్న జనం

తెల్లవారుజామున నుంచి ఫ్లో తగ్గడంతో పునరావాస కేంద్రాల నుంచి ఇండ్లలోకి జనం చేరుకున్నారు. ఇండ్లలోకి మొత్తం మట్టి, చెత్త వచ్చి చేరడంతో క్లీనింగ్ చేసుకున్నారు. పరిసరాలు చెత్త, వ్యర్థాలతో నిండిపోయి దుర్వాసనతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఇండ్లలో తడిసిన వస్తువులను చూసి ప్రజలు కన్నీరు పెట్టారు.  రోడ్లపై సైతం మోకాళ్ల లోతు బురద చేడంతో జేసీబీలు, జీహెచ్ఎంసీ యంత్రాలతో  క్లీన్ చేయిస్తున్నారు.

 పూర్తిగా క్లీన్ అయ్యేందుకు రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. దోమలు తీవ్రంగా ఉండటంతో ఎంటమాలజీ విభాగం సిబ్బందితో ఫాగింగ్ తో పాటు యాంటీ లార్వా ఆపరేషన్లు చేయిస్తున్నారు. అనారోగ్య సమస్యలు, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో హెల్త్ క్యాంపులను  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి తిరుగుతూ అవరమైన వారికి మందులు అందిస్తున్నారు.

3 వేల మంది రెండ్రోజులు ఇండ్లకు దూరం

రెండ్రోజులుగా మూసీ పరివాహక ప్రజలు పునరావాస కేంద్రాల్లో కొంత మంది తలదాచుకోగా, ఇంకొందరు వారి బంధువల ఇండ్ల వద్దకు వెళ్లారు. ఇలా దాదాపు 3 వేల మంది వరకు ఇండ్లను వదలాల్సి వచ్చింది. వరద తగ్గిన కూడా బురద ఉండడంతో చాలా ఇండ్లకు కరెంట్ సరఫరా జరగలేదు. బురద పూర్తిగా ఇండ్లలో ఉండటంతో ఇంకా కొందరు ఇండ్లలోకి రాలేదు. ఈ ప్రాంతంలో అద్దెలకు ఉంటున్నవారు సొంతూళ్లకు వెళ్లారు. స్కూళ్లకు సెలవులు ఉండటంతో పాటు దసరా పండుగ ఉండటంతో పండుగ తరవాత తిరిగి
 రానున్నారు.

తెరుచుకోని మూసారాంబాగ్, చాదర్​ఘాట్​ బ్రిడ్జిలు 

చాదర్ ఘాట్ పాత బ్రిడ్జి, మూసారాంబాగ్ బ్రిడ్జ్ వద్ద అర్ధరాత్రి కూడా ప్రవాహం కొనసాగింది. ఉదయం తీవ్రత తగ్గినప్పటికీ బ్రిడ్జిలు దెబ్బతినడంతో పాటు చెత్త, చెట్లు పేరుకుపోవడంతో వాటిని క్లియర్ చేస్తున్నారు. దీంతో అక్కడ రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అలాగే రెండు బ్రిడ్జిల పటిష్టతను ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించి అవసరమైతే మరమ్మతులు చేపట్టిన  తరువాతనే రీఓపెన్ చేయనున్నారు. మూసారాంబాగ్ లో కొత్తగా కడుతున్న బ్రిడ్జి నిర్మాణాన్ని  వెంటనే  పూర్తి చేయాలని స్థానికులు కోరారు. రెండేండ్ల క్రితం పనులు మొదలుపెట్టిననాఆలస్యం అవుతుందని, పనులు పూర్తయితే స్థానికులకు ఇబ్బందులు తొలుగుతాయన్నారు.