
వేములవాడ, వెలుగు: పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో రూ.9.20 కోట్లతో మహిళా హాస్టల్ బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పర్యటించిన సమయంలో హాస్టల్ లేక స్టూడెంట్స్ ఇబ్బందులను గమనించి సీఎం దృష్టికి తీసుకుని వెళ్లానని, ఆయన వెంటనే హాస్టల్ బిల్డింగ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారన్నారు. అంతకుముందు వన మహోత్సవంలో భాగంగా వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాలలో వివిధ రకాల మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యవరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ రాజన్న ఆలయం, పట్టణ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో నాలుగు విశాలమైన గోశాలల నిర్మాణానికి కేబినెట్ ఆమోదించిందని గుర్తు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ తిప్పాపూర్ గోశాలకు ఐఎస్వో సర్టిఫికెట్ వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాజన్న ఆలయ ఈవో రాధాబాయి, మున్సిపల్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.