ఏటీఎంల చోరీ గ్యాంగ్ అరెస్ట్  : సీపీ సాయిచైతన్య 

ఏటీఎంల చోరీ గ్యాంగ్ అరెస్ట్  : సీపీ సాయిచైతన్య 

నిజామాబాద్, వెలుగు : సిటీలోని ఖలీల్ వాడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్​ ఏటీఎంతో పాటు అర్గుల్​లో ఏటీఎం చోరీకి  విఫల యత్నం చేసిన హర్యానా స్టేట్ గ్యాంగ్​ను అరెస్ట్​ చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. శుక్రవారం కమాండ్​ కంట్రోల్​ రూమ్​లో మీడియాతో సీపీ మాట్లాడారు. ఈ ముఠా గతేడాది జూలైలో హైదరాబాద్​ షాపూర్​నగర్ హెచ్​డీఎఫ్​సీ ఏటీఎం నుంచి రూ.30 లక్షలు కొల్లగొట్టారని వివరించారు. గ్యాస్​ కట్టర్​తో ఏటీఎంలు ఓపెన్​ చేయడంలో ఐదుగురు సభ్యుల ముఠా సిద్ధహస్తులన్నారు. డిసెంబర్ 31న జహీరాబాద్​లో ఏటీఎంలో దొంగతనానికి విఫలయత్నం చేసి నిజామాబాద్​ పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ ఏటీఎంను గ్యాస్​కట్టర్​తో తెరువడానికి ప్రయత్నించారన్నారు.

బ్లూకోల్ట్స్​ పోలీసులు అటుగా వస్తున్న సంగతి గమనించి పారిపోయారన్నారు. అలారం మోగడంతో అర్గుల్​లో ఏంటీఎం ఓపెన్ చేయడం ఆపేశారని తెలిపారు. అంతకు ముందు హర్యానాలోని ఉధంపుర, శివపురిలో ఏటీఎంలు తెరిచి రూ.లక్షలు కొల్లగొట్టిన కేసులో జైలుకు కూడా వెళ్లారన్నారు. శుక్రవారం కార్​లో గ్యాస్​ కట్టర్​, కర్రలు పెట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతున్న గ్యాంగ్ సభ్యులు అబ్లుల్లా ఖాన్, మహ్మద్​ అమీర్, వహాబ్​ఖాన్, మహ్మద్​ అజీజ్, శామొద్దీన్​ను అరెస్ట్​చేశామన్నారు. వీరంతా హర్యానా స్టేట్​కు చెందిన వారని చెప్పారు. ఏసీపీ రాజావెంకట్​రెడ్డి తదితరులు ఉన్నారు.