కాలేజీ భూములను పక్కదారి పట్టించింది కమిటీ సభ్యులే : కామారెడ్డి విద్యార్థి సంఘాల ఆరోపణ

కాలేజీ భూములను పక్కదారి పట్టించింది కమిటీ సభ్యులే : కామారెడ్డి విద్యార్థి సంఘాల ఆరోపణ

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి డిగ్రీ కాలేజీ భూములను కాపాడింది విద్యార్థి సంఘాలేనని, పక్కదారి పట్టించింది కమిటీ సభ్యులేనని కామారెడ్డి విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆరోపించారు.  మంగళవారం కామారెడ్డిలో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. కామారెడ్డి ఎడ్యుకేషన్​ సొసైటీ ఏర్పాటు చేసి విద్య అవసరాల కోసం  264 ఎకరాల భూములు అప్పగిస్తే     కొన్ని భూములు ఇతర సంస్థలకు ఇచ్చారన్నారు.

 పోలీస్​ స్టేషన్, దూరదర్శన్, స్టేడియం,  గోదాములతో పాటు ప్రైవేట్ స్కూల్​కు ఇచ్చారన్నారు.   అప్పటి సొసైటీ సెక్రటరీ, సభ్యులు  భూములను పక్కదారి పట్టించారన్నారు. దీంతో విద్యార్థులు ఉద్యమాన్ని చేపట్టారన్నారు. 2015లో సొసైటీని రద్దు చేస్తూ ప్రభుత్వానికి తీర్మానం పంపారన్నారు. కానీ 2018లో 2 ఎకరాల 2 గుంటల భూమి శిశు మందిర్​కు ఎలా లీజ్​కు ఇచ్చారని ప్రశ్నించారు.

ఆరోరా ఇంజినీరింగ్ కాలేజీకి పూర్తి బాధ్యత ఎమ్మెల్యేనే వహించాలన్నారు. ఎమ్మెల్యే తన మాటలతో విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.   డిగ్రీ కాలేజీ స్థలాల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్, కాలేజీ భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు.  

కార్యక్రమంలో టీఎన్ఎస్​ఎఫ్​ స్టేట్ సెక్రటరీ బాలు, బీవీఎం స్టేట్ సెక్రటరీ విఠల్, ఎస్ఎఫ్​ఐ జిల్లా సెక్రటరీ అరుణ్​కుమార్,  టీజేఎస్ జిల్లా ప్రెసిడెంట్ లక్ష్మణ్, పీడీఎస్ఎస్​ జిల్లా సెక్రటరీ సురేశ్,  బీసీ విద్యార్థి సంఘాల ప్రెసిడెంట్ నీల నాగరాజు,  ఎన్ఎస్​యూఐ జిల్లా సెక్రటరీ భరత్ తదితరులు పాల్గొన్నారు.