
హైదరాబాద్ సిటీ, వెలుగు: వనమహోత్సవానికి జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తున్నది. ఈసారి గ్రేటర్లో 25.52 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నది. వీటితోపాటు మరో లక్ష మొక్కలను నేరుగా నగరవాసులకు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏటా వర్షాకాలంలో హరితహారం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని గతేడాది నుంచి వనమహోత్సవం పేరుతో కాంగ్రెస్ప్రభుత్వం మొక్కలు నాటుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం వనమహోత్సవాన్ని ప్రారంభించిన వెంటనే జీహెచ్ఎంసీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వచ్చేనెల 15లోపు ఈ ప్రోగ్రాం నిర్వహించే అవకాశముంది. గతంలో కోటి మొక్కలు నాటినట్లు లెక్కలు చెబుతున్నప్పటికీ అందులో కొన్ని జీహెచ్ఎంసీ నేరుగా నాటింది. మిగతావి అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఆదేశాల మేరకు అధికారులు ప్రజలకు పంపిణీ చేశారు. అందులో చాలా వరకు మొక్కలు వృథా అయ్యాయి.
ఈసారి 25 లక్షల మొక్కలను నేరుగా జీహెచ్ఎంసీ నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా కూడా మొక్కలు వృథా కాకుండా ముందస్తుగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. పార్కులు, ఓపెన్ ప్లేస్లు, సెంట్రల్ మీడియన్, ఖాళీ స్థలాలతో పాటు రోడ్లకు ఇరువైపుల నాటనున్నారు. ఇందుకోసం జోన్లవారీగా ప్రణాళికలు కూడా రెడీ అయ్యాయి.